విశాఖపట్నం జిల్లాలో 3 ఫారెస్ట్ డివిజన్లు ఉన్నాయి. పాడేరు, నర్సీపట్నం, విశాఖపట్నం డివిజన్లలో సుమారు 40 శాతం అటవీ భూ భాగం ఉంది. ముఖ్యంగా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు చాలాకాలంగా అడవిని నమ్ముకుని పోడు భూములు సాగు చేసుకుంటూ ఉంటారు. మైదాన ప్రాంతాల్లో పూర్వకాలం నుంచి భూములకు పట్టాలు ఉంటాయి. కానీ మన ప్రాంతంలో కొండ భూములకు పట్టాలు ఉండవు. దీనికోసం 2005 అటవీ భూములపై హక్కుల చట్టం ఏర్పాటైంది. అప్పటి నుంచి గిరిజనులకు ఈ చట్టం వరంగా మారింది.
2008 నుంచి ఈ చట్టం కార్యరూపం దాల్చింది. ఇప్పటివరకూ మూడు విడతల్లో 85 వేల ఎకరాలు అటవీ భూములకు పట్టాలిచ్చారు. 38 వేల మంది లబ్ధి పొందారు. గిరిజనులకు మరింత మేలు కలిగే విధంగా అటవీ భూముల హక్కుల చట్టం ప్రకారం 45 వేల ఎకరాల అటవీ భూమిలో 26 వేల మందికి ఇవ్వనున్నారు. ఈసారి ఏజెన్సీ ప్రాంతంతోపాటు మైదాన ప్రాంత షెడ్యూల్ ఏరియాలో.. అనకాపల్లి, నర్సీపట్నం ప్రాంతాల్లో కూడా పట్టాలు ఇవ్వనున్నామని అధికారులు చెబుతున్నారు.
ఆగస్టు 9న అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా మెుదట పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. తర్వాత పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. సెప్టెంబరు, అక్టోబర్లో పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: రాష్ట్రీయ స్వచ్ఛ్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని