ఎవరికీ అనుమానం రాకుండా తోటి వయస్సు యువకులను, వారి స్నేహితులను పరిచయం చేసుకుని వారి ఇళ్లలోని ల్యాప్టాప్లు, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగిలిస్తున్న ఒక ఘరానా దొంగను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి సుమారు రూ.లక్ష విలువైన 12 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఏసీపీ శ్రావణ్కుమార్, సీఐ కె.రామారావుతో కలిసి డీసీపీ (క్రైమ్) సురేష్బాబు సోమవారం వెల్లడించారు. ఆ వివరాలు..
* నక్కవానిపాలెం, వెంకోజీపాలెం, నక్కవానిపాలెం రామాలయం ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు తమ ల్యాప్టాప్లు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఆయా ఇళ్ల పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి, ఎక్కువగా రాకపోకలు సాగించే వారిపై దృష్టి పెట్టారు. అనుమానంతో ఎండాడ ప్రాంతానికి చెందిన చందక మణికంఠ(24)ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మోసగాడు అతడేనని గుర్తించారు.
* విజయనగరం జిల్లా గురుగుబిల్లి గ్రామానికి చెందిన మణికంఠ నగరంలో యువకులు ఎక్కువగా నివాసముంటున్న ప్రాంతాల్లో సంచరిస్తూ, తన వయస్సు వారితో పరిచయం పెంచుకుని స్నేహం నటిస్తాడు. ఈ క్రమంలో గదుల్లో నివాసముంటున్న వారినే లక్ష్యంగా చేసుకుని, వారి రాకపోకలను గమనించి ఇందుకు పాల్పడుతుంటాడు. సాధారణంగా చదువు, ఉద్యోగం నిమిత్తం కొంతమంది కలిసి విశాఖలో జీవనం సాగిస్తుంటారు. వీరు రోజూ తమ విధులకు వెళ్లే సమయంలో గదిలో ఉండే మిగతా వారి కోసం తాళాలను ఇంటి పరిసరాల్లోనే జాగ్రత్త చేసి వెళ్తుంటారు. అలాంటి గదుల్లోకి ఎవరూ లేని సమయంలో మణికంఠ ప్రవేశించి ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదు దొంగిలిస్తుంటాడు.
* పోలీసులకు కేవలం ఐదు ల్యాప్టాప్లు పోయినట్లుగా బాధితుల నుంచి ఫిర్యాదు రాగా, విచారణలో 12 దొంగిలించినట్లు మణికంఠ నేరం ఒప్పుకొన్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇతడు గతంలో హైదరాబాద్లో కూడా మోసం చేసినట్లు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. దొంగిలించిన వాటిని వివిధ దుకాణాలకు తీసుకువెళ్లి, తన ఆధార్కార్డును చూపి వాటిని అమ్మేసి నగదు చేసుకునేవాడని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండీ.. ఉప ఎన్నికకు రెండు ఈవీఎంలు