అక్రమ మద్యం రవాణా చేస్తూ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (SEB) అధికారులకు పట్టుబడ్డారు. విశాఖ జిల్లా కేడిపేటకు చెందిన చింతల గౌరీ శంకర్ విశాఖ స్టీల్ ప్లాంట్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత కొంతకాలంగా గౌరీ శంకర్ దిల్లీ నుంచి రైలు మార్గాన బ్రాండెడ్ మద్యం బాటిళ్లను రవాణా చేసి స్థానికంగా విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు నిఘా ఉంచి.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఈనెల 17న గౌరీ శంకర్ రెండు ఇనుప పెట్టెలను తీసుకుని విశాఖ విమానాశ్రయం నుంచి దిల్లీకి వెళ్ళాడు. అక్కడ అతడికి పరిచయం ఉన్న రమేశ్ అనే వ్యక్తి ద్వారా బదర్పూర్ ప్రాంతంలో బ్రాండెడ్ మద్యం బాటిళ్లను కొనుగొలు చేశాడు. వాటిని తన వెంట తీసుకువెళ్లిన రెండు పెట్టెల్లో నింపి వాటికి పోలీసు అనే పేరుతో స్టిక్కర్లు అంటించి ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో విశాఖకు తరలించే ఏర్పాట్లు చేశాడు. అనంతరం అతడు రైలులో కాకుండా విమానం ద్వారా విశాఖ చేరుకున్నాడు.
ఏపీ ఎక్స్ప్రెస్ రైలు అనకాపల్లికి చేరుకున్న తరువాత మద్యం బాటిళ్లు ఉన్న పెట్టెలను దించేందుకు గౌరీ శంకర్ ప్రయత్నించాడు. అప్పటీకే అతడిపై నిఘా ఉంచిన సెబ్ అధికారులు అనకాపల్లి, దువ్వాడ రైల్వేస్టేషన్లలో కాపు కాశారు. తనపై నిఘా ఉన్నట్లు అనుమానం కలగటంతో మద్యం బాటిళ్లను దించుకోకుండా గౌరీ శంకర్ అక్కడినుంచి పరారయ్యాడు. ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకోగానే మద్యం బాటిళ్లు ఉన్న పెట్టెలను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెట్టెలపై ఉన్న ట్యాగ్ల ఆధారంగా కానిస్టేబుల్ గౌరీ శంకర్ను అదుపులోకి తీసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ బాబ్జిరావు తెలిపారు.
అక్రమంగా తరలించిన మద్యం నకిలీవిగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మెుత్తం 143 బాటిళ్లు స్వాధీనం చేసుకోగా..అన్నింటిపై ఒకే బార్ కోడ్ ఉందన్నారు. మద్యాన్ని ల్యాబ్కు పంపించి నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
'విజయవాడ డ్రగ్స్ విలువ రూ.9 వేల కోట్లు కాదు.. 15వేల కోట్లు!'