ఒడిశా వైపు వెళ్లాల్సిన వాయుగుండం సిక్కోలులోనే తీరం దాటేసింది. ఊహకందని పరిస్థితితో అక్కడి ప్రజలు గజగజలాడారు. 2018 అక్టోబర్ 10న అర్ధరాత్రి మొదలైన తిత్లీ బీభత్సం... మరునాడు ఉదయం 10 గంటల వరకు కొనసాగింది. శ్రీకాకుళం జిల్లా చిన్నవంక-డోకులపాడు గ్రామాల నుంచి పల్లిసారధి మీదుగా తీరం దాటింది. గాలుల అలజడి ఆగినా... ఆ తరువాత వచ్చిన భారీ వర్షం...ఆ ప్రాంతవాసుల్ని కకావికలం చేసింది. పచ్చని పంటలతో అలరారుతున్న ప్రాంతాల్లో కల్లోలం నింపింది. కొబ్బరి, జీడితోటలను ధ్వంసం చేసి... మత్స్యకారుల జీవితాల్ని తిత్లీ తుఫాను అతలాకుతలం చేసింది.
తిత్లీ సృష్టించిన కష్టాల నుంచి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం వాసులు నేటికీ తేరుకోలేకపోతున్నారు. వివిధ రంగాలపై ఆధారపడిన లక్షలాది కుటుంబాల పరిస్థితి ఇవాళ్టికి ప్రశ్నార్థకంగానే ఉంది. జీవనోపాధి కరవై శాశ్వత గృహాలు కట్టుకోలేక.. ఎంతో మంది తాత్కాలిక ఏర్పాట్లతోనే జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల నాటి తుఫాను ప్రభావానికి 19 మండలాల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉద్దానం 7మండలాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని 32 వేల ఎకరాల్లో సాగుచేసిన...కొబ్బరితోటల్లో 26 వేల ఎకరాలు పూర్తిగా దెబ్బతింది. 53 వేల కొబ్బరి రైతు కుటుంబాలకు చెందిన కొబ్బరితోటలు నేలకొరిగాయి. మరోవైపు జీడితోటలు సాగు చేసిన దాదాపు 78 వేల రైతున్నలకు ప్రత్యక్షంగా నష్టం వాటిల్లింది.
తిత్లీ తుఫాను తీవ్రతను గుర్తించిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి... అస్తవ్యస్తంగా మారిన విద్యుత్తు వ్యవస్థను పునరుద్ధరించింది. తాగునీరు, ఆహారం, నిత్యావసరాలు సత్వరం అందేలా చేసింది. తిత్లీ పరిహారం పెంపు ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్... 150 కోట్ల రూపాయల అదనపు లబ్ధి చేకూర్చుతున్నట్లు గతేడాది పలాసలో ప్రకటించారు. ప్రతి కొబ్బరి చెట్టుకు 15 వందల నుండి 3 వేల రూపాయల వరకు... జీడిమామిడి హెక్టారుకు 30 వేల నుండి 50 వేల రూపాయలకు పెంచుతున్నట్లు చెప్పారు. కానీ... వైకాపా ప్రభుత్వం అందిస్తామన్న పరిహారం కార్యచరణ కూడా అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. ఆరోజు ఇచ్చిన ఐదుగురు చెక్కులకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. నేటికీ మిగిలిన రైతులూ పరిహారం కోసం ఎదురుచూస్తున్నాను.
తిత్లీ తుపాను దాటికి ఉద్దానం ప్రాంతంలో 15 లక్షల 97 వేల కొబ్బరిచెట్లు అతలాకుతలమైయ్యాయి. పరిహారం తొందరిలోనే ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉపాధి అవకాశాల కల్పనతోనే అదుకునే చర్యలు చేపడతామని అధికారులు అంటున్నారు. ఉద్దానం రైతన్నల జీవనచిత్రం మరింత దుర్భరంగా మారకముందే పాలకులు తగు చర్యలకు ఉపక్రమించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీచదవండి