Achchennaidu Sensational Comments on YCP: ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు పేదరికాన్ని పెంచుతున్న వైసీపీని గద్దె దించడమే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పేదరికం విపరీతంగా పెరిగిపోయిందని మండిపడ్డారు. తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ అట్టడుగు స్థానానికి పడిపోయిందని ధ్వజమెత్తారు. మద్యం రేట్లను పెంచి.. లక్ష కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని అమ్మి పేద, మధ్య తరగతి ప్రజల జేబులను ఖాళీ చేశారని విమర్శించారు.
అనంతరం పన్నులు, ధరలు, ఛార్జీలను పెంచి ప్రజల సంపాదనను గుంజుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.47 వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. తెచ్చిన రూ. 6 లక్షల కోట్ల అప్పులో సగం జగన్ రెడ్డి ముఠా దోచుకుందని దుయ్యబట్టారు. పేదరికం లేని సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ ఆశయానికి జగన్ రెడ్డి గండికొట్టారని ఆక్షేపించారు. చంద్రబాబు ద్వారానే పేదరికం లేని సమాజం, తెలుగు జాతి పునర్ వైభవం సాధ్యమని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి