PDF MLC: రాష్ట్రంలో పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పీడీఎఫ్ (ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్) ఎమ్మెల్సీలు చేపడుతున్న ‘బడి కోసం బస్సు యాత్ర’ శ్రీకాకుళం జిల్లా పలాసలో సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, బాలసుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, శ్రీనివాసులురెడ్డి, షేక్ సాబ్జీ మాట్లాడుతూ.. జీవో 117తో చేపడుతున్న పాఠశాలల విలీన ప్రక్రియ జాతీయ విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకమని తెలిపారు. ఈ జీవోతో భవిష్యత్తులో డీఎస్సీ ద్వారా నియామకాలు జరగవని చెప్పారు. ప్రాథమిక పాఠశాలలను యథాతథంగానే కొనసాగించాలని డిమాండు చేశారు. ఆందోళన చేస్తున్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ నెల 31న అనంతపురం జిల్లా పెనుకొండలో యాత్ర ముగుస్తుందని చెప్పారు. పలువురు ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అడుగడుగునా అడ్డంకులు: బస్సు యాత్ర చేపట్టిన పీడీఎఫ్ ఎమ్మెల్సీలను పోలీసులు నిర్భందించారు. యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, షేక్షాబ్జి, యూటీఎఫ్ నాయకులు తెలిపారు. పాలకొండ, వీరఘట్టం మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటకు పార్వతీపురం చేరుకోవాల్సి ఉండగా పోలీసులు అనుమతించకపోవడంతో ఒడిశా మీదుగా 200 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేశామన్నారు. సాయంత్రం 5.30 గంటలకు పార్వతీపురం మండలంలోని కొత్తవలసలో భోజనాలు చేశారు. అనంతరం బయలుదేరుతున్న సమయంలో పోలీసులు బస్సును ఎస్పీ బంగ్లాకు తీసుకెళ్లారు. రాత్రి ప్రయాణం వద్దని, మంగళవారం ఉదయం ఏం చేయాలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం ఉంటుందని ఎస్పీ చెప్పినట్లు షేక్షాబ్జి విలేకర్లకు తెలిపారు.
ఇవీ చదవండి: