సచివాలయం ఏఎన్ఎం ఉద్యోగాల కౌన్సెలింగ్ ప్రక్రియలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో గందరగోళం చోటు చేసుకుంది. సరైన ప్రణాళిక లేకుండా అభ్యర్థులను కౌన్సెలింగ్కు పిలిచినందున మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మౌళిక సదుపాయాల కల్పనలో జిల్లా వైద్యాధికారులు విఫలమయ్యారు. ర్యాంకుల వారీగా పిలుస్తారేమోనని అభ్యర్థులు ఉదయం 9 గంటలకే డీఎంహెచ్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఎక్కువమంది కార్యాలయానికి రావటంతో తోపులాట జరిగింది. అధికారులపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తే బాగుండేదని సూచించారు. ర్యాంకుల వారీగా పిలుస్తారని గంటల తరబడి కార్యాలయం ముందు వేచి ఉన్నా ప్రయోజనం లేదని వెళ్లిపోయారు. మరికొంత మంది అభ్యర్థులు తమకు కౌన్సెలింగ్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళనకు దిగారు. కేవలం కొత్త రిజిస్ట్రేషన్ అనే సాకుతో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇటువంటి నిబంధన లేదన్నారు. అధికారులను కలిసినా తమ సమస్యకు పరిష్కారం లభించలేదని ఆవేదన చెందారు. ప్రభుత్వం వెంటనే కల్పించుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి :