ప్రకాశం చీమకుర్తి మండలంలోని దేవరపాలెం పంచాయతీ ఓబచెత్తపాలెంలో నిషేధిత క్యాట్ఫిష్ సాగు చేస్తున్న చెరువులను మత్య్సశాఖ అధికారులు సోమవారం ధ్వంసం చేశారు. సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో 13 చెరువులు ఏర్పాటు చేశారు. వీటిలో క్యాట్ఫిష్ను అనధికారికంగా పెంచుతున్నారు. సమాచారం అందుకున్న మత్స్యశాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. చెరువు కట్టలను జేసీబీతో ధ్వంసం చేయించారు.
చేపలను గుంతలు తీసి బ్లీచింగ్ వేసి పూడ్చి వేశారు. నిషేధిత క్యాట్ఫిష్ను చెరువుల్లో సాగు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ సహాయ సంచాలకురాలు ఎ.ఉషాకిరణ్ హెచ్చరించారు. ఏఎస్సై నరసింహారెడ్డి, వీఆర్వో ఏడుకొండలు, వీఆర్ఏ రాధ, వీఎఫ్ఏ ఏడుకొండలు రెడ్డి తదితరులు ఆమె వెంట ఉన్నారు.