ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మండలం త్రోవగుంట నుంచి ఏడుగుండ్లపాడు, దొడ్డవరప్పాడు, సీతారామ్పురం, మద్దిపాడు, వెల్లంపల్లి, గుండ్లాపల్లి, గ్రోత్సెంటర్ వరకు ఉన్న 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం వాహనచోదకులకు నరకాన్ని దాటినట్లేనని ఏటా ఇక్కడ చోటుచేసుకునే ప్రమాదాలు చెబుతున్నాయి. ఈ 20 కిలోమీటర్ల పరిధిలో 2017లో 240 చిన్న, పెద్ద ప్రమాదాలు చోటుచేసుకోగా... 2018లో 190, 2019లో 205, 2020లో అక్టోబరు వరకు 110 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోగా.. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
ఈ రహదారిపై జరిగిన ఘటనల్లో ప్రధానంగా 2020 జూలైలో తెలంగాణకు చెందిన గొర్రెల కాపారులు రహదారుల వెంట గొర్రెలను తోలుకు వెళుతుండగా గ్రోత్ సెంటర్ వద్ద లారీ ఢీకొని 20 గొర్రెలు, ఒక కాపరి మృతి చెందారు. ఈ హృదయవిదారకర ఘటన స్థానికులను కలచివేసింది. వెల్లంపల్లికి చెందిన లారీ డ్రైవర్, ఓనరు కర్ణాటకకు వెళ్లి తిరిగు ప్రయాణంలో పార్కింగ్ స్థలంలో లారీని ఆపి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరూ దుర్మరణం చెందారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
2019 జూలైలో కృష్ణా జిల్లాకు చెందిన ఓ కుటుంబం శ్రీవారి తిరుమలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో గుండ్లాపల్లి వద్ద వీరి కారును పాల ట్యాంకర్ ఢీకొంది. డ్రైవర్తోపాటు నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. తిరుపతికి చెందిన కుటుంబంలోని 9మంది పెళ్లిచూపులకు రాజమహేంద్రవరం వెళ్లి వస్తుండగా కారును ఏడుగుండ్లపాడు వద్ద లారీ ఢీకొంది. ఇందులో ఐదుగురు మృతి చెందడం, అందులో చిన్నారులు ఉండటం స్థానికుల చేత కంటతడి పెట్టించింది.
2018 కందుకూరులోని ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన అధ్యాపకులు నలుగురు హైదరాబాద్కు శిక్షణ నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా దొడ్డవరపాడు వద్ద పాఠశాల బస్సు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఒకరికి కాళ్లు విరిగడం అందరినీ కలచివేసింది. అదే ఏడాది అక్టోబరులో ఒంగోలకు చెందిన ఒకే కుటుంబానికి చెంది 13 మంది ఇఫ్తార్ విందు కోసం కారులో ప్రయాణిస్తుండగా సీతారామ్పురం వద్ద బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మిగిలిన వారు గాయాలపాలవడం ఆ కుటుంబాలు వేదనకు గురిచేశాయి. ఇలా నిత్య ప్రమాదాలు అందరినీ హడలెత్తిస్తున్నాయి.
గ్రోత్సెంటర్కు మద్దిపాడుక మధ్య తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవే చెక్పోస్టు, పోలీసులు ఉన్నప్పటికీ పగటిపూట ఎవరూ కనిపించరు. నిత్యం పర్యవేక్షణతోపాటు జాతీయ రహదారిపై వేగ నియంత్రణ సూచికలు ఏర్పాటు చేసి అమలు చేయాలి. రహదారి మధ్యన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి. ప్రమాదాల నివారణకు చర్యలు. -శ్రీనివాసరావు, బ్యాటరీ వ్యాపారి, గుండ్లాపల్లి
త్రోవగుంట-గ్రోత్సెంటర్ మధ్య ఎన్హెచ్-16పై జరుగుతున్న ప్రమాదాలపై సర్వే చేశాము. హైవే మొబైల్ పోలీసులను పెంచి పర్యవేక్షిస్తున్నాం. త్రోవకుంట నుంచి మద్దిపాడు వరకు ప్రమాదాలు తగ్గాయి. వెల్లంపల్లి నుంచి అటువైపు ఎక్కువగా జరుగుతున్నాయి. రాత్రిపూట విద్యుత్ లైట్లు లేకపోవడం, అజాగ్రత్తగా క్రాస్ చేయడం, సర్వీసురోడ్డు నుంచి జాతీయ రహదారికి అటూఇటూ అడ్డదారుల్లో దూసుకురావడం లాంటి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించాం. హైవే అధికారులతో సమన్వయంతో వాహనచోదకులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. దీనిపై నిత్య పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలతో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతాం.-సుబ్బారావు, సీఐ, ఒంగోలు రూరల్