కొవిడ్ టీకాపై చేసే వ్యయం వృథా అని వైకాపా కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ అన్నారు. కేంద్రబడ్జెట్లో ఆరోగ్య, కుటుంబసంక్షేమ పద్దులపై లోక్సభలో బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
‘కొవిడ్-19 లాంటివి వందేళ్లకోసారి వస్తాయి. వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వొద్దు. కొవిడ్-19 టీకాకు రూ.35వేల కోట్లు వెచ్చించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వైద్యునిగా నా దృష్టిలో అదంతా వృథా వ్యయం. కొవిడ్ టీకా 6-9 నెలల పాటు మాత్రమే సహాయపడుతుంది. తర్వాత ఆ రూ.35వేల కోట్లు ఆవిరైపోతాయి. ఆ మొత్తాన్ని ప్రాథమిక ఆరోగ్య రక్షణకు మళ్లించాలి. అది దేశానికి ఎంతో అవసరం. కొవిడ్కు విశ్వజనీనమైన టీకా సాధ్యం కాదు. కాబట్టి అంత మొత్తం వెచ్చించొద్దు. రాష్ట్రంలో కొత్త 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. కేంద్ర ప్రభుత్వం ఆ కళాశాలలకు నిధులివ్వాలి. దేశంలో 70% ప్రజలు గ్రామాల్లో ఉంటే.. అక్కడ 30% మాత్రమే అర్హులైన వైద్యులున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వైద్యులు వెళ్లేందుకు వారికి పన్నులు, పరికరాల కొనుగోళ్లు, విద్యుత్తు బిల్లుల్లో రాయితీ ఇవ్వాలి. మిక్సోపతితో ఆయుర్వేద వైద్యులు సర్జన్లు అయితే ఎంతో ప్రమాదం. ఈ విషయంపై పునరాలోచించండి. మంగళగిరి ఎయిమ్స్ వేగంగా పూర్తిచేసేందుకు నిధులు కేటాయించండి. కడప, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించండి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి:
సీఐడీ ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ.. హై కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్