Kerala Style Fish Curry in Telugu : చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచివని నిపుణులు చెబుతుంటారు. గుడ్లు, చికెన్, మటన్లా వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. నార్మల్గా చేపలను ఒక్కొక్కరూ ఒక్కోలా వండుతారు. ఎక్కువ మంది ఫిష్ ఫ్రై, పులుసు ఇష్టపడతారు. అయితే, ఎప్పుడూ మన దగ్గర వండినట్లుగా కాకుండా ఓసారి ఇలా కేరళ స్టైల్ చేపల పులుసు ప్రిపేర్ చేయండి. ఈ చేపల పులుసు మరీ పుల్లగా కాకుండా నోటికి చాలా రుచికరంగా ఉంటుంది. మరి సింపుల్గా కేరళ స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- శుభ్రం చేసిన చేప ముక్కలు - 500 గ్రాములు
- మెంతులు - అర టీస్పూన్
- ఆవాలు - టీస్పూన్
- ఉల్లిపాయలు - 3 (పెద్ద సైజ్లో ఉన్నవి)
- టమాటా - 2
- కరివేపాకు - 3 రెమ్మలు
- ఉప్పు - రుచికి తగినంత
- అల్లం - 2 ముక్కలు
- వెల్లుల్లి రెబ్బలు - 8
- చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంతా
- కొబ్బరి నూనె - 3 టేబుల్స్పూన్లు
- పచ్చిమిర్చి - 3
- పసుపు - అరటీస్పూన్
- కారం - రుచికి సరిపడా
- ధనియాల పొడి - 2 టీస్పూన్లు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఆపై చేపల పులుసులోకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా సన్నగా కట్ చేసి పక్కన ప్లేట్లోకి తీసుకోండి.
- తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసి పక్కన చిన్న గిన్నెలోకి తీసుకోండి.
- ఇప్పుడు స్టవ్పై పాన్ పెట్టి కొబ్బరి నూనె పోసుకోండి. వేడివేడి నూనెలో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపండి. (ఇక్కడ మీరు కొబ్బరి నూనెకు బదులుగా వేరుశనగ నూనె కూడా వాడచ్చు.)
- ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపండి.
- మసాలాలు కూరగాయలకు బాగా పట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- ఇప్పుడు స్టవ్పై పాన్ పెట్టి కొద్దిగా కొబ్బరినూనె వేయండి. ఆపై ఆవాలు, మెంతులు వేసి వేపుకోండి.
- అనంతరం ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపండి. అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేయండి.
- ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ వేసి ఫ్రై చేయండి.
- ఒక రెండు నిమిషాల తర్వాత ఈ స్టేజ్లో చేపల పులుసుకి సరిపడా వాటర్ పోసి కలుపుకోవాలి.
- రుచికి సరిపడా ఉప్పు, చింతపండు వేసుకోవాలి.
- పులుసు మరుగుతున్నప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసి కలుపుకోవాలి. గిన్నెపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి.
- చేపల పులుసు ఉడుకుతున్న సమయంలో మధ్యమధ్యలో గరిటెతో కలపకండి. ఇలా చేస్తే చేప ముక్కలు విరిగిపోతాయి.
- చేపల పులుసు చక్కగా ఉడికి కర్రీలో ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక కరివేపాకు అలాగే వేయండి.
- ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
- అంతే ఇలా సింపుల్గా చేసుకుంటే కేరళ స్టైల్ చేపల పులుసు మీ ముందుంటుంది.
- కేరళ స్టైల్ చేపల పులుసు రెసిపీ నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి.
మెత్తటి ముక్కలతో నోరూరించే మటన్ ఫ్రై - ఇలా చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది!
టేస్టీ అండ్ హెల్దీ "అలసందల దోశలు" - ఉల్లిపాయ కారంతో రుచి అద్దిరిపోతాయి!