కర్నూలు జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసిన రైతులకు అదే ప్రాజెక్టు వర్షాకాలంలో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రాజెక్టులో నీటి పరిమాణం స్థాయి పెరుగుతున్న కొద్దీ వారి గుండెల్లో దడ కూడా పెరుగుతోంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ జీవనం సాగించాల్సి వస్తోంది.
ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులకు చేరి, నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు చేరితే సమీప గ్రామాల ప్రజలు తట్టాబుట్టా సర్దుకొని దూరప్రాంతాలకు తరలి పోవాల్సి ఉంటుంది. శ్రీశైలానికి 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయని తెలుస్తుంది. రోజురోజుకూ..అంతకంతకూ నీటిమట్టం పెరుగుతున్నా స్థానిక అధికారుల్లో చలనం కనిపించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందలేదు
“ మూడురోజుల కిందట పరిస్థితిని సమీక్షించాం. ఈ మేరకు గ్రామాల్లోని వీఆర్ఏలను అప్రమత్తం చేశాం. తాజా పరిణామాలపై సమాచారం లేదు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు.”- వేణుగోపాలరావు, తహసీల్దారు, పాములపాడు
మండలాల వారీగా ప్రభావిత గ్రామాలు..సమస్యలు
కొత్తపల్లి : చిన్నగుమ్మడాపురం, ముసలిమడుగు, ఎర్రమఠం, పాతమాడుగుల, కపిలేశ్వరం, జడ్డువారిపల్లి, బట్టువారిపల్లి, సింగరాజుపల్లి గ్రామాల్లో సుమారు 15 వేల మంది ప్రజలు నిరాశ్రయులవుతారు. సింగరాజుపల్లి, నుంచి ఆత్మకూరుకు రాకపోకలు పూర్తిగా స్తంభించి పోతాయి.
పగిడ్యాల : సంకిరేణిపల్లి, నెహ్రూనగర్, ఘనపురం, ముచ్చుమర్రి. సుమారు 16 వేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు.
పాములపాడు : లింగాల, చెలిమిల్ల, ఇస్కాల వెనుకజలాలకు సమీపంగా ఉన్నాయి. వెనకజలాలు స్థానిక ఎస్సారెమ్సీ కాల్వ ఎడమగట్టు గండ్ల ద్వారా కుడి గట్టుకు చెందిన సూపర్ప్యాసేజ్ వంతెనల నుంచి జూటూరు, రుద్రవరం, తుమ్మలూరు గ్రామాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే సుమారు 5 వేల జనాభా నిరాశ్రయులవుతారు. జాతీయ రహదారిపై పూర్తిగా రాకపోకలు స్తంభించి పోతాయి. స్థానిక భవనాశి నదికి పైతట్టు ప్రాంతంలో ఎడతెరపి లేని వర్షాలు కురవడంతో ఇప్పటికే ఆ ప్రాంతాలు నీటి మునిగాయి. భవనాశి నది నీరు వెనకజలాల్లో కొంత, ఎస్సారెమ్సీ కాల్వలో కొంత కలవడంతో నీటి ఉద్ధృతి పెరగనుంది.
జూపాడుబంగ్లా : చావోలు, పోతులపాడు, 80 బన్నూరు గ్రామాలు ముంపునకు గురవుతాయి. 3 వేల మంది ప్రజలు ఇబ్బందులకు పాలవుతారు. బన్నూరు దగ్గర కాకిలేరు వాగు ఉద్ధృతి పెరగడంతో ఇప్పటికే పంట పొలాలు నీటమునిగాయి. జూపాడుబంగ్లా సమీపంలోని ఆంజనేయస్వామి గుడి దరిదాపుల్లో శ్రీశైలం జలాలు ఇప్పటికే దర్శనమిస్తున్నాయి.
నందికొట్కూరు : శాతనకోట, మల్యాల, నాగటూరు వెనక జలాలకు సమీపంలో ఉన్నాయి.
ఇవీ చదవండి: శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల