కర్నూలు జిల్లావాసుల దశాబ్దాల కల సాకారమైంది. కర్నూలు విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు ఆరంభమయ్యాయి. మొదటి విమానం బెంగళూరు నుంచి కర్నూలు చేరుకుంది. మరో విమానం కర్నూలు నుంచి విశాఖ చేరుకుంది. బెంగళూరు నుంచి వచ్చిన తొలి విమానంలో ఎంపీ గోరంట్ల మాధవ్, పలువురు ప్రజాప్రతినిధులు ప్రయాణించారు. కర్నూలుకు 20కిలోమీటర్ల దూరంలో ఓర్వకల్లు వద్ద...వెయ్యి ఎకరాల్లో నిర్మించిన విమానాశ్రయాన్ని 3 రోజుల క్రితం...సీఎం జగన్ ప్రారంభించారు. బ్రిటీష్ వారితో పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును విమానాశ్రయానికి పెడుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కర్నూలు నుంచి విమాన సేవలు ప్రారంభం కావటం...సంతోషంగా ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ హర్షం వ్యక్తం చేశారు.
విశాఖ నుంచి సర్వీసులు ప్రారంభం
విశాఖ విమానాశ్రయం నుంచి కర్నూలుకు విమాన సేవలను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ విమాన సర్వీసుల వల్ల రాయలసీమ-ఉత్తరాంధ్రకు మధ్య అనుసంధానం పెరిగి.. మరింత అభివృద్ధి జరుగుతుందని మంత్రి అన్నారు. పర్యాటకంగానూ మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటుకు శ్రీకారం!
ఓర్వకల్లులో సుమారు 9 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ రాబోతోందని... దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కారిడార్ ఏర్పాటు చేస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. జగన్నాథగట్టు ప్రాంతంలో క్లస్టర్ యూనివర్శిటీ, సిల్వర్ జూబ్లీ కళాశాల భవనాలు నిర్మిస్తున్నామని... హైవేల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివరించారు.
కర్నూలు నుంచి తిరుపతి, విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభించే యోచన చేస్తున్నామని ఏపీ విమానాశ్రయాభివృద్ధి కార్పొరేషన్ ఎండీ భరత్ రెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి: