పుర ఎన్నికల్లో కీలకమైన కౌంటింగ్ పక్రియ...... ఆదివారం ఉదయం 8గంటలకు ప్రారంభంకానుంది. కృష్ణా జిల్లాలో 2 నగరపాలక సంస్థలు, 5 పురపాలికలకు సంబంధించి.... మొత్తం ఏడింటికి కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లయోలా కళాశాల నూతన భవనం, ఆడిటోరియం ప్రాంతాల్లో కౌంటింగ్ చేపడతారు. నూతన భవనం 3 అంతస్తుల్లో మొత్తం విజయవాడలోని 40 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేస్తారు. ఆడిటోరియం గ్రౌండ్ ఫ్లోర్లో 8 హాళ్లను ఏర్పాటుచేసి 24 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ నిర్వహిస్తారు. మొత్తం 64 డివిజన్ల పరిధిలోని ఓట్ల లెక్కింపు కోసం 23 హాళ్లను సిద్ధం చేశారు. మొదటి, రెండు రౌండ్లలో 23 చొప్పున 46 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. మూడో రౌండ్లో 18 డివిజన్లకు సంబంధించిన లెక్కింపు పూర్తి చేస్తారు. 3 నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లను ర్యాండమ్గా ఎంపిక చేసి 3 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారని అధికారులు తెలిపారు.
ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 806 సిబ్బందిని వినియోగిస్తున్నారు. వీరిలో 704 మంది కౌంటింగ్లో పాల్గొంటారు. 32 మంది రిటర్నింగ్ అధికారులు, 34 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు విధుల్లో ఉంటారు. వీరికి తోడు మరో 36 మంది పర్యవేక్ష, సహాయక సిబ్బందిని నియమించారు. ప్రతి డివిజన్ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లూ ఇక్కడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. నగరంలో 2వేలమంది ఉద్యోగులు ఉండగా...748 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీటిని క్రోడీకరించి డివిజన్లవారీగా విభజించి సంబంధిత ఆర్ఓల టేబుళ్ల వద్దకు చేరుస్తారు. ఆ తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు... అనుసరించాల్సిన విధానంపై సూచనలు చేశారు.
ఇవీ చదవండి