కృష్ణా జిల్లాలోని మొవ్వ, గూడూరు, కలిదిండి, మచిలీపట్నం మండలాల పరిధిలో వేదాంత సంస్థ 35 చమురు, సహజవాయువు బావులను తవ్వనుంది. అంచనా వ్యయం రూ.650 కోట్లు. ఇది ఆన్షోర్ ప్రాజెక్టు. ఈ ప్రాంతమంతా కేజీ బేసిన్లోని కాజ బ్లాక్ పరిధిలోకి వస్తుంది. దీని విస్తీర్ణం 114.93 చ.కి.మీ.లు. ఈ ప్రాజెక్టును వేదాంత సంస్థకు చెందిన చమురు, సహజవాయువు విభాగం కెయిర్న్ ఆధ్వర్యంలో చేపట్టాలన్నది ప్రతిపాదన. దీనికి సంబంధించి పర్యావరణ ప్రభావ మదింపు నివేదికను ఈకో కెమ్ సేల్స్ అండ్ సర్వీసెస్ అనే కన్సల్టెన్సీ సంస్థ రూపొందించింది. దీనిపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి డిసెంబరు 17న గూడూరు మండలం తురుకతూరులోని తుర్లపాటి కమల జిల్లాపరిషత్ హైస్కూల్ ఆవరణలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది.
జాతీయ చమురు కంపెనీలకు చెందిన, చిన్న చిన్న చమురు క్షేత్రాల్ని ప్రైవేటు సంస్థలకు కేటాయించడం ద్వారా వినియోగంలోకి తెచ్చే విధానంలో భాగంగా కాజ బ్లాక్ 2018లో వేదాంత సంస్థకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ సంస్థ తవ్వనున్న 35 బావుల్లో మొవ్వ మండలంలో 14, గూడూరులో 18, కలిదిండిలో 2, మచిలీపట్నంలో ఒకటి ఉన్నాయి. ఈ బ్లాక్లో చమురు, సహజవాయు నిల్వలు ఏ మేరకు ఉన్నాయో అంచనా వేసేందుకు ఓఎన్జీసీ గతంలో 3 చోట్ల బావులు తవ్వింది. వాటిలో 2 చోట్ల ఏమీ లభించలేదు. రాఘవపురం ప్రాంతంలో తవ్విన బావి ద్వారా ఆ ప్రాంతంలో... సహజవాయువు ఉందని గుర్తించింది.
చమురు నిల్వలూ ఉండే అవకాశం లేకపోలేదన్న అంచనాకి వచ్చింది. ‘హైడ్రో ఫ్యాక్చరింగ్’ విధానం ద్వారా మరింతగా గ్యాస్ నిల్వల్ని వెలికి తీయవచ్చనిఅంచనా వేశారు. అప్పట్లో భూమిలో 2,300 మీటర్ల లోతు వరకు బావి తవ్వారు. కాజ బ్లాక్లో తవ్వనున్న 35 బావుల నుంచి రోజుకి 30 వేల బ్యారెళ్ల చమురు, 30 మిలియన్ ఘనపుటడుగుల (మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ ఫీట్) సహజవాయువు వెలికి తీయగలమని వేదాంత సంస్థ అంచనా వేస్తోంది.
ప్రాజెక్టుతో కాలుష్యమే
చమురు బావులు తవ్వడం, హైడ్రోకార్బన్ల ప్రాసెసింగ్వల్ల పర్యావరణ, ధ్వని, జల కాలుష్యాలు ఉంటాయని కన్సల్టెన్సీ సంస్థ పర్యావరణ ప్రభావ మదింపు నివేదికలో పేర్కొంది. డ్రిల్లింగ్ సమయంలో ఏర్పడే దుమ్ము, ధూళితో పాటు, నిరంతరం హైడ్రోకార్బన్లను మండించడంవల్ల నైట్రిక్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటివి వెలువడటం వల్ల గాలి కలుషితమవుతుందని పేర్కొంది.
డ్రిల్లింగ్ కోసం, క్యాంప్ సైట్లో అవసరాల కోసం ఎక్కువగా వినియోగించడం వల్ల నీటి కొరత ఏర్పడుతుందని, డ్రిల్లింగ్లో వాడే మడ్, రసాయనాల వల్ల ఉపరితల జలాలు కలుషితమవుతాయని పేర్కొంది. ప్రాజెక్టు కోసం ప్రతిపాదిత ప్రదేశంలోని భూమిపై ఆధారపడిన రైతులు, వివిధ వృత్తుల వారు ఉపాధి కోల్పోతారని ఆ సంస్థ పేర్కొంది. వీలైనంత వరకు వ్యవసాయ భూముల్ని తీసుకోకుండా చూడాలని, ఉపాధి కోల్పోయిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని చెప్పింది.
భూమి కుంగిపోతుంది
వేదాంత సంస్థ చమురు బావులు తవ్వుతామని చెబుతున్న ప్రాంతంలో భూమి లోపల ఉన్నవన్నీ మెత్తటి రాళ్లు (సాఫ్ట్ రాక్స్). అక్కడ తవ్వకాలు జరపడం వల్ల భూమి కుంగిపోయి పల్లపు ప్రాంతంగా మారిపోతుంది. గోదావరి జిల్లాల్లో తవ్వకాలు జరిపిన చోట అదే అనుభవం ఎదురైంది. భూమి కుంగి నీరు నిలిచిపోయి.. వ్యవసాయం చేయలేరు. ముఖ్యంగా వరి పండించేందుకు అసలు పనికిరాదు. డ్రిల్లింగ్ కోసం రకరకాల రసాయనాలు వినియోగిస్తారు. వాటిని పక్కనే ఉన్న పొలాల్లోకే వదిలేస్తారు. దాని వల్ల రైతులతో పాటు, పర్యావరణానికీ హాని జరుగుతుంది. - కె.బాబూరావు, విశ్రాంత శాస్త్రవేత్త, సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ సంస్థ కన్వీనర్
ఇదీ చదవండి: రాష్ట్రానికీ నివర్ ముప్పు... చిత్తూరు జిల్లాను తాకనున్న తీవ్ర తుపాను