Jal Jeevan funds: జల్జీవన్ మిషన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఖర్చుపెట్టడం లేదని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ ప్రశ్నించారు. ‘ప్రతి ఇంటికీ నాణ్యమైన తాగునీటిని అందించేందుకు ప్రవేశపెట్టిన జల్జీవన్ మిషన్ ద్వారా ఏపీకి రూ.7వేల కోట్లు కేటాయిస్తే రూ.193 కోట్లే ఖర్చుపెట్టారు. రూ.7వేల కోట్లలో కేంద్ర వాటా రూ.3,800 కోట్లు. నిధులు ఎందుకు ఖర్చు పెట్టలేదో బెంగుళూరులో శనివారం రోజు దక్షిణాది రాష్ట్రాల అధికారుల సమావేశంలో అడుగుతా. ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వానికి చేయూత అందిస్తున్నాం. కేంద్రంలో మోదీ పాలనాదక్షత వల్ల ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు గుర్తింపు లభిస్తోంది. గతంలో గాంధీలా ఇప్పుడు మోదీకి ఆదరణ పెరుగుతోంది’ అని పేర్కొన్నారు.
రూ.200 కోట్లకు రూ.2వేల కోట్లు రావాలన్నారు..
భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కింద రూ.12వేల కోట్లను కేంద్రం ఖర్చుపెట్టిందని తెలిపారు. ‘మరో రూ.2వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పింది. అయితే.. కేంద్ర మంత్రి పర్యటనలో ఆరాతీస్తే రూ.200 కోట్లే రావాలని తేలింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని లెక్కలు చూపిస్తే ఎలా?’ అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల్లో ప్రతి కుటుంబాన్నీ కలిసి, వారి కష్టాలు తెలుసుకుని ఆదుకోవాలని కేంద్ర మంత్రి షెఖావత్ చెప్పిన ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మోదీ ప్రాజెక్టుగా పిలవాలి: జీవీఎల్
పోలవరం, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్టుడే: కేంద్ర నిధులతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును ఇకపై మోదీ(మల్టిపుల్ ఆబ్జెక్టివ్ డ్యామ్ ఆఫ్ ఇరిగేషన్)గా పిలవాలని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆకాంక్షించారు. శుక్రవారం పోలవరం వద్ద కేంద్ర మంత్రి షెఖావత్ భాజపా కార్యర్తలతో నిర్వహించిన సమావేశంలో జీవీఎల్ పాల్గొని మాట్లాడారు.
వెలిగొండ పేరు సవరించాలి..
ప్రకాశం జిల్లా వెలిగొండ బదులు వెలుగోడు అని నోటిఫికేషన్లో పేర్కొన్నందున న్యాయం జరగడంలేదని ప్రకాశం జిల్లా భాజపా అధ్యక్షుడు శ్రీనివాసులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిని సవరించాలని కోరారు. ఇది తనకు తెలుసని, ఇబ్బంది లేకుండా చూస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చదంవడి: పోలవరానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది: షెకావత్