తెలంగాణ మద్యం ఆంధ్రప్రదేశ్లోకి అక్రమంగా రవాణా అవుతోంది. ఆంధ్రాలో మద్యం ధరలు పెరగటంతో కృష్ణాజిల్లాలోని తెలంగాణ సరిహద్దు మండలాల్లో తెలంగాణ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పలుచోట్ల చెక్ పోస్ట్ లు పెట్టి గట్టి నిఘా చర్యలు తీసుకున్నప్పటికీ మద్యం రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. సరిహద్దు గ్రామాల్లో పోలీసులు ఏర్పాటుచేసిన చెక్ పోస్టుల వద్ద పట్టుబడుతున్న మద్యానికి నాలుగు రెట్లు అధికంగా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ కంటే ఆంధ్రాలో 75% ధరలు అధికంగా ఉండటంతో పాటు, సరైన బ్రాండ్లు దొరక్కపోవడంతో మద్యం ప్రియులు ఎక్కువగా తెలంగాణ మద్యాన్ని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ రవాణా దారులు మద్యం రవాణాకు అనేక అక్రమ మార్గాలు వెతుకుతున్నారు. నిత్యావసరాలు రవాణా చేసే లారీలు మొదలుకొని కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, మినీ వ్యాన్, స్కూటర్లు ఇలా ఏది దొరికితే దానిలో మద్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. సరిహద్దు మండలాలైన జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, మైలవరం, నూజివీడు,గంపలగూడెంల పరిధిలోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మద్యాన్ని రవాణా చేస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో పోలీసులు ఏర్పాటుచేసిన చెక్ పోస్టుల ద్వారా 770 మందిని అదుపులోకి తీసుకొని వారిపై 450 కేసులు నమోదు చేశారు. 325 వాహనాలను సీజ్ చేశారు. 9800 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇది చదవండి 'లక్షణాలు కనబడని కొవిడ్ కేసులు భారత్లోనే ఎక్కువ'