రాష్ట్రానికి చెందిన ఆదర్శ రైతుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉదయం ఫోన్ చేశారు. ఆ రైతు ఆనందానికి అవధులు లేవు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలేనికి చెందిన ఆదర్శరైతు ఉప్పల ప్రసాదరావుకు శనివారం ఉదయం 9.30 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. సీడ్రిల్ ఆధునిక వ్యవసాయ యంత్రాలు, వాటితో వెద పద్ధతిలో సాగు అంశాలపై.. రైతు ప్రసాదరావును కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. తాను 35 ఎకరాల్లో సీడ్రిల్ను ఉపయోగించి వెద పద్ధతిలో సన్నాల రకం వరి సాగు చేశానని... 40-45 బస్తాలు దిగుబడి సాధించానని ప్రసాదరావు తెలిపారు. త్వరలో కారు పంపిస్తానని, తెలంగాణలో వ్యవసాయ పద్ధతులు పరిశీలించాలని, ఒకపూట ఉండి భోజనం చేసి వెళ్లాలని ప్రసాదరావుకు కేసీఆర్ ఆహ్వానం పలికారు. కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతో ప్రసాదరావును స్థానిక రైతులు అభినందించారు.
ఇదీ చదవండీ... మూడు రోజుల పాటు అట్టహాసంగా ఇళ్ల పట్టాల పంపిణీ