కృష్ణా జిల్లా మోపిదేవిలో మత్స్యకార బాలుర ఆశ్రమ పాఠశాల ప్రక్కన 216 జాతీయ రహదారిపై టోల్ ప్లాజా నిర్మాణ ప్రయత్నాన్ని స్థానికులు వ్యతిరేకించారు. ఈ ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని.. నిరసన చేపట్టారు. పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో.. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పాల్గొన్నారు. టోల్ ప్లాజా ప్లాన్ తయారు చేసినప్పుడు తెదేపా నాయకులు ఏమీ మాట్లాడకుండా.. ఇప్పుడు పాఠశాల పోతుందని నిరసన తెలియజేయడం.. ఎంతవరకు సమంజసం అనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలని అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎంపీ మోపిదేవి వెంకటరమణతో టోల్ ప్లాజా నిర్మాణ విషయంలో మాట్లాడానని గుర్తు చేశారు. కేవలం గత ప్రభుత్వ నాయకులు తప్పిదాల వల్ల మాత్రమే నేడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలి..
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని.. అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. సుమారు 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని.. టోల్ గెట్ వలన పిల్లలకు అనేక సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో పాటుగా వెళ్లి.. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి సమస్య వివరిస్తామని వెల్లడించారు. టోల్ ప్లాజా ఇక్కడే నిర్మాణం చేస్తే ఇంకా ఉద్యమం ఉద్ధృతం చేస్తామని రవీంద్ర హెచ్చరించారు. పాఠశాల పూర్వ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: