కృష్ణాజిల్లా నాగాయలంకకు చెందిన ఉన్నీసాబేగంకు ఫించన్ నిలిపివేయటంతో ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. భర్త మహ్మద్ హుస్సేన్ 15 ఏళ్ల క్రితం బస్సు ఢీకొని మృతి చెందాడు. 2008 నవంబరు నుంచి వితంతు ఫించను ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో హఠాత్తుగా పింఛను నిలిచిపోయింది. సుమారు రెండు సంవత్సరాల కాలం గడిచినా ఆమెకు మళ్లీ ఫించను రాలేదు. ఆమె దగ్గర గత ఫించన్ పుస్తకం ఉంది. రేషన్ కార్డు, ఆధార్ ఓటరు కార్డులు కూడా ఉన్నాయి. రెండు సంవత్సరాలుగా అందరినీ వేడుకుంటుంది అయినా ఫలితం శూన్యం.
కరోనా లాక్ డౌన్ కాలంలో ఉచిత రేషన్ కూడ ఇవ్వలేదు. ఉన్నీసాబేగం ఫించను పుస్తకానికి చెందిన అదనపు కాగితం కలెక్టర్ నుంచి తెచ్చుకుంది. మమ్మల్ని కాదని కలెక్టర్ దగ్గరకు వెళ్తావా అంటూ ఓ ఉద్యోగిని సదరు కలెక్టర్ ఇచ్చిన స్లిప్పును మూడు ముక్కలుగా చింపి పారేయడం జరిగింది. ఇక అంతే అప్పటినుంచి ఏ ఫింఛను లేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా తన అభ్యర్ధన యాత్ర సాగించినా ఫలితం దక్కలేదు. అన్ని కార్డులూ ఉన్నాయి కానీ రెండేళ్ల నుంచి ఆదుకునేవారు లేరు.. ఆదరణ లేదు.. కృష్ణాజిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా తనకు పింఛన్ఇప్పించాలని కోరుతుంది.