పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ప్రకృతిని ఆస్వాదిస్తూ పాఠాలు నేర్చుకోవడం.. వింటుంటూనే ఆహా అనిపిస్తోంది కదూ. అలాంటి వాతావరణం విద్యార్థులకు అందించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 'నేషనల్ గ్రీన్ కార్ప్' ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమం.. కృష్ణా జిల్లాలో ఉద్యమంలా నడుస్తోంది. విద్యార్థులను బృందంగా చేసి వారితో మెుక్కలు నాటించి, బాధ్యతను పూర్తిగా వారికే అప్పగిస్తున్నారు. ఆ విద్యార్థి బృందం పాఠశాలకు వచ్చేటప్పుడు, వెళ్లేముందు సంరక్షణ బాధ్యతలు చూసుకుంటుంది. ఇలా చేయడం వల్ల నాటిన మెుక్కలు చనిపోకుండా పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నాయి. దీనివల్ల పాఠశాల వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతోందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేషనల్ గ్రీన్ కార్ప్లో భాగంగా మెుక్కలు నాటడం, సంరక్షణ చూడటమే కాకుండా... పర్యావరణంపైనా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. కొత్త కర్మాగారాల నిర్మాణం, ఎయిర్పోర్టుల అభివృద్ధి, సాంకేతికత అందిపుచ్చుకునే క్రమంలో వాతావరణానికి ఏ విధంగా హాని జరుగుతుందన్న విషయాలు విద్యార్థులకు వివరిస్తున్నారు. మెుక్కల ఆవశ్యకతను ఉపాధ్యాయులు తెలియజెబుతున్నారు.
పాఠశాలల్లో మెుక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారులు పలు నర్సరీల నుంచి రకరకాల మెుక్కలు తెప్పిస్తున్నారు. పూల మెుక్కలతోపాటు, పండ్ల మెుక్కలనూ నాటుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలలకు 5 వేల రూపాయల చొప్పున అందిస్తున్నారు. విద్యార్థులను మమేకం చేస్తూ సాగుతున్న ఈ కార్యక్రమం బాగుందని ఉపాధ్యాయులు అంటున్నారు.
ఇదీ చూడండి: