జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్... వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి లేఖ రాశారు. బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్న సీఎం జగన్ బీసీ ద్రోహులు కారా... మీ వరుస సంఖ్య మారగానే అంకెలు గుర్తొచ్చాయా? అంటూ లేఖలో ప్రశ్నించారు. మీ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం చేయడం వాస్తవం కాదా అంటూ ధ్వజమెత్తారు.
139 బీసీ ఉపకులాల ఏర్పాటు హామీ ఎపుడు అమలు చేస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్లు కుదించి 20,000 మంది బీసీలకు పదవులు రాకుండా చేసిన మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా? అని లేఖలో ప్రశ్నించారు. బీసీల్లో పేద విద్యార్థులు... విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించకూడదని విదేశీ విద్యకు మంగళం పాడారని మండిపడ్డారు.
సబ్సిడీ రుణాల మంజూరు నిలుపుదల చేసి బీసీలు ఆర్థికంగా ఎదగకుండా కుట్రలు చేయడం వాస్తవం కాదా అంటూ మండిపడ్డారు. బీసీలకు కేటాయించిన బడ్జెట్ నుంచి అమ్మఒడి, పింఛన్లు, ఇళ్ల పట్టాలకు బీసీ నిధులను పక్కదారి మళ్ళించడం వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు. బీసీలను అంకెలతో మోసం చేస్తూ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని చూస్తున్న మిమ్మల్ని బీసీలు నమ్మే పరిస్థితిలో లేరని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'వైకాపా వైఫల్యాలను తెదేపాపై నెట్టి తప్పించుకుంటున్నారు'