ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపణలు చేస్తున్న వారు.. నేరాల రేటు తగ్గడాన్ని గుర్తించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ప్రతి లక్ష జనాభాకు 2017లో 253.9, 2018లో 243.4, 2019లో 227.9 చొప్పున నేరాలు నమోదయ్యాయన్నారు. జాతీయ సగటుతో పోల్చుకున్నా ఆంధ్రప్రదేశ్లో మెరుగ్గానే ఉందని తెలిపారు. 2016 నుంచి ఏటా జనవరి-సెప్టెంబర్ మధ్య జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పరిశీలిస్తే.. ఈ ఏడాదే తక్కువేనని వెల్లడించారు. విచారించ తగిన నేరాలలో 18 శాతం తగ్గుదల కనిపించదని చెప్పారు.
కొవిడ్ నిషేధాజ్ఞలు, ఇసుక, మద్యం అక్రమ రవాణాల వల్ల ఈ ఏడాది నమోదైన ఎఫ్ఐఆర్ల సంఖ్య 2.50 లక్షలకు చేరిందని డీజీపీ తెలిపారు. ఈ నేరాల్లో చిక్కిన 69 మంది పోలీసు సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. 'ఏపీ పోలీస్ సేవ' ద్వారా తక్కువ వ్యవధిలోనే 18,429 మంది ఎఫ్ఐఆర్ కాపీలు పొందారన్నారు. రాష్ట్రంలో 13,262 మంది పోలీసులు కరోనా బారిన పడగా.. 12,537 మంది కోలుకున్నారని 624 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. 101 మంది ప్రాణాలు కోల్పోయినా.. అత్యంత క్లిష్ట సమయాల్లోనూ సేవలందించామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విజయవాడ కాల్పుల ఘటనలో ముగ్గురు అరెస్టు: సీపీ