విజయవాడ మధురానగర్లో ఒక ఆవు దూడకు బారసాల నిర్వహించటం అందరినీ ఆకట్టుకుంది. వి.వి.నరసరాజు రోడ్డులోని శ్రీకృష్ణ దేవాలయం గోశాలలోని గోవు ఒక దూడకు జన్మనిచ్చింది. సోమవారం ఉదయం ఆలయ కమిటీ సభ్యులు ఆ దూడకు అంగరంగ వైభవంగా బారసాల కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీ అని నామకరణం చేశారు. ఊయలలో ఉంచి సంప్రదాయబద్ధంగా ఊపారు.
శ్రీకృష్ణ మందిరంలోని గోశాలలో 2018 డిసెంబరులో దేవాలయం కోసం పుంగనూరు ఆవు దూడ కోనుగోలు చేశారు. అప్పటినుంచి మందిరంలో దాని ఆలనపాలనతో పాటు.. గో పూజలు చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబరులో పుంగనూరు గోవు సూడి కట్టింది. ఈ ఏడాది మే 27న ఆ గోవుకు సంప్రదాయ పద్ధతిలో మందిరం కమిటీ శ్రీమంతం చేసింది. ఆ సమయంలో మహిళలకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేశారు. గతనెల 30న పుంగనూరు గోవు దూడకు జన్మనిచ్చింది. ఈ దూడకు సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి ఊయలలో వేశారు. ఆలయ కమిటీ సభ్యులు సాంబశివరావు దంపతులు ఆవు దూడకు బారసాల చేసి లక్ష్మిగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నివారణ జాగ్రత్తలను పాటిస్తూనే గోవు దూడను ఊయలలో వేసి ఊపుతూ పూజలు చేసి హాజరైన అందరికీ తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: సిలబస్, బోధన సమయం కుదింపు దిశగా కేంద్రం