తెనాలిలో ఐకాస దీక్షా శిబిరానికి వైకాపా శ్రేణులు నిప్పుపెట్టాయి. అప్రమత్తమైన తెదేపా శ్రేణులు... వెంటనే మంటలార్పివేశాయి. ఈ ఘటనలో... అమరావతి నినాదంతో ఉన్న ఫ్లెక్సీలు దగ్ధమయ్యాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణతో.. తెనాలిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెనాలి దీక్షా శిబిరాన్ని మాజీమంత్రులు నక్కా ఆనంద్బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెదేపా నేతలు సందర్శించారు.
దీక్షాశిబిరంపై వైకాపా కార్యకర్తల దాడి సరికాదని మాజీమంత్రులు ఆనంద్బాబు, ఆలపాటి పేర్కొన్నారు. 20 రోజులుగా జరుగుతున్న దీక్షలను భగ్నం చేసేందుకు వైకాపా కుట్ర పన్నిందని ఆనంద్బాబు ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే దాడులకు పాల్పడటం విచారకరమన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే దాడి చేయడం దారుణమని ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందన్న ఆలపాటి.. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : తెనాలిలో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య తోపులాట.. తీవ్ర ఉద్రిక్తత