గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో ఆదివారం రాత్రి దళిత, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన ఇబ్బందులు, సమస్యలపై చర్చా గోష్టి నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వర్ల రామయ్య.. అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేసి వైకాపా అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయని, పోలీసు యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తోందని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యరపతినేనిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. తాను చంద్రబాబుకు చెప్పి ఆయనకు మంత్రి పదవి ఇప్పిస్తామనిని ప్రజలనుద్దేశించి హామీ ఇచ్చారు.
సభకు అధ్యక్షత వహించిన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ 2022 ఏప్రిల్ నుంచి డిసెంబరు లోపు జమిలీ ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిని వారాలబ్బాయిగా అభివర్ణించారు. పిన్నెల్లి, భట్రుపాలెం, అంబాపురం, నారాయణపురాల్లో చోటుచేసుకున్న సంఘటలను వివరిస్తూ దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలను అణగదొక్కుతున్నట్లు ఆరోపించారు. చేనేత విభాగం నేత ముస్యం శ్రీనివాసరావుతో పాటు పలువురికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అతిథులను సత్కరించారు. రాష్ట్ర వడ్డెర కార్పోరేషన్ మాజీ చైర్మన్ దేవెళ్ల మురళీ మాట్లాడుతూ వడ్డెర్ల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముందుగా తంగెడ రోడ్డు నుంచి సభాస్థలి వరకు కార్యకర్తలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: