గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల ఆంకాంక్షలను నెరవేర్చని వైకాపా ప్రభుత్వం ఏడాది ఉత్సవాలు చేసుకోవటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నమ్మి గెలిపించిన ప్రజలపై కరెంటు బిల్లులు పెంచి నడ్డి విరిచినందుకా సంబరాలంటూ ధ్వజమెత్తారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకు ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. వైకాపా పాలన ప్రజా వేదిక కూల్చివేతతోనే విధ్వంసానికి తెరతీశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రమంతా విధ్వంసమేనని.. అన్ని గ్రామాల్లో కక్ష సాధింపులు, వేధింపులేనని విమర్శించారు. ప్రపంచం గర్వించతగ్గ స్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణం చేపడితే, ఆ పనులు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన ఏడాదిలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదనీ, ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి తరలిపోయాయన్నారు. వైకాపా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పాలన సాగించాలని జీవీ ఆంజనేయులు హితువు పలికారు.
ఇదీ చదవండి: డాక్టర్ సుధాకర్ కేసు: మెజిస్ట్రేట్ నమోదు చేసిన వివరాలివే