దారికి అడ్డంగా వచ్చిన కారుని తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. పక్కనే ఉన్న ఇనుప సామాన్ల దుకాణంలోకి దూసుకెళ్లడంతో అక్కడ కాపలాగా ఉన్న బెల్లంకొండ స్వామి(35) అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం:
ఒంగోలు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు 39 మంది ప్రయాణికులతో విజయవాడకు వెళ్తోంది. ఈ క్రమంలో చిలకలూరిపేటలోని బస్టాండ్ ఎదురుగా హఠాత్తుగా కారు అడ్డుగా వచ్చింది. తప్పించే క్రమంలో బస్సును పక్కకు తిప్పడంతో సమీపంలోని ఇనుప సామాను దుకాణంలోకి దూసుకెళ్లింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అది కూడా విరిగి పడింది. ఈ ఘటనలో షాపు వద్ద కాపలాగా ఉన్న బెల్లంకొండ స్వామి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్తంభం విరిగిపడిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: బైక్ అదుపుతప్పి ఒకరు మృతి.. కారు ఢీకొని మరొకరికి తీవ్ర గాయాలు