కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో చూడచక్కని గదులు, విశాల మైదానంతో ఆకట్టుకుంటున్న ప్రాంగణం.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రాజుపేటలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల. 6 కోట్ల రూపాయలతో అట్టహాసంగా..తరగతి గదులు, గ్రంథాలయం, ప్రయోగశాల, వసతిగృహం, అత్యాధునిక వంటగది, డైనింగ్ హాలు నిర్మించారు. విద్యార్థులు ఆడుకునేందుకు విశాల మైదానంతోపాటు దాని చుట్టూ ప్రహరీగోడనూ నిర్మించారు. పనులన్నీ ఏడాది క్రితమే పూర్తయినా.. ఇప్పటికీ ఈ పాఠశాల ప్రారంభానికి నోచుకోలేదు.
రూ. 6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పాఠశాలకు.. కేవలం రూ.12 లక్షల విలువైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయలేక నిరుపయోగంగా ఉంచారు. ప్రభుత్వం నుంచి నిధులు రాక దాదాపు ఏడాదిన్నరగా ప్రారంభోత్సవానికి ఈ గురుకులం ఎదురుచూస్తోంది.
మరోవైపు అద్దె భవనంలో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. చాలీచాలని ఇరుకు గదులతో ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న రేకుల షెడ్డులో గాలి కూడా రావడం లేదని, మరుగుదొడ్లు కూడా సరిపోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తున్న షెడ్డుకు నెలకు లక్షా 30వేల రూపాయలు అద్దె చెల్లిస్తున్నారు. ఒక ఏడాది అద్దె సొమ్ముతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకుంటే..సకల సౌకర్యాలతో కూడిన భవనాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం 150 మంది.. విద్యార్థుల కోసం తీసుకున్న అద్దె భవనంలో ఇప్పుడు 420 మంది విద్యార్థులను కుక్కేశారు. వసతి సౌకర్యం లేక ప్రవేశాలు నిలిపివేశారు.
"తినడానికి స్థలం సరిపోవడం లేదు. ఆడుకుందామంటే ఆటస్థలం లేదు..తరగతి గదిలో కూర్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. వర్షం పడితే క్లాసులు జరగటం వినటం కష్టంగా మారింది" -విద్యార్థులు
"నెలకు లక్షా 30వేల రూపాయలు అద్దె చెల్లిస్తున్నారు. ఒక ఏడాది అద్దె సొమ్ముతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకుంటే..సకల సౌకర్యాలతో కూడిన భవనాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది'' -శరత్, సహాయ ప్రధానోపాధ్యాయుడు
ఇప్పటికైనా పాలకులు ఆలోచించి.. రూ.12 లక్షలు వెచ్చించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: