గుంటూరు జిల్లా నరసరావుపేటలోని మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రైతువారోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న ఎద్దుల పందేల పోటీలను రాష్ట్ర గృహనిర్మాణ శాఖామంత్రి శ్రీ రంగనాధరాజు సందర్శించారు. పోటీలో పాల్గొన్న ఒంగోలు జాతి ఎద్దులను ఆయన తిలకించారు. రైతులను శాలువాలతో సత్కరించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎద్దుల బండిపై స్టేడియంలో తిరుగుతూ రైతులకు మంత్రి అభివాదం చేశారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
గతంలో ప్రతి గ్రామంలో రైతుకు చేదోడు వాదోడుగా ఒంగోలు జాతి ఎద్దులు నిలబడ్డాయని మంత్రి శ్రీ రంగనాధరాజు గుర్తుచేశారు. యాంత్రీకరణలో భాగంగా ట్రాక్టర్లు రైతులకు అందుబాటులోకి రావడంతో ఒంగోలు జాతి ఎద్దులు కనుమరుగవుతున్నాయన్నారు. రైతులు ఒంగోలు జాతి ఎద్దులను పెంపొందించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. నేడు నరసరావుపేటలో నిర్వహిస్తున్న ఎద్దుల పందాల పోటీల్లో రైతుల ఉత్సాహాన్ని చూస్తే ఆనందంగా ఉందని మంత్రి శ్రీ రంగనాధరాజు కొనియాడారు.
ఇదీ చదవండి: కాలి బూడిదైన 20 గుడిసెలు.. ఎక్కడంటే..?