గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి బియ్యం సరఫరా చేసే వాహన రంగులు, చిత్రాలపై ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై పౌరసరఫరాలశాఖ కమిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది.
గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం... పౌరసరఫరా అధికారులు ఎస్ఈసీకి రేషన్ వాహనాలను చూపారు. వాహనాలను పరిశీలించిన ఎస్ఈసీ రంగులు మార్చాలని.. వాహనాలపై ఉన్న ఫొటోలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తటస్థ రంగులు వేసి మరోసారి పరిశీలనకు తీసుకువస్తే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ శశిధర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు రేషన్ అందించేందుకు వాహనాలను అనుమతించాలని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఈ పథకం అమల్లో ఉందన్నారు. అమల్లో ఉన్న పథకానికి కొనసాగింపు మాత్రమేనని ధర్మాసనానికి తెలిపారు. వాహనంపై వైకాపా పార్టీ రంగులు కాకుండా ఇతర రంగులు సైతం ఉన్నాయని న్యాయస్థానానికి తెలిపారు. వాహనంపై ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలు ఉంచవచ్చని సుప్రీంకోర్టు గతంలో తెలిపిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పేదలకు బియ్యం అందించే ప్రక్రియను నిలువరించటం సరికాదని పిటిషనర్ న్యాయవాది తెలిపారు.
బియ్యం పంపిణీ వాహనాల రంగులపై పలు పార్టీలు అభ్యంతరం తెలుపుతూ... తమ దృష్టికి తీసుకువచ్చారని ఎస్ఈసీ తరపు న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. బియ్యం పంపిణీ తాము నిలువరించలేదని.. పట్టణ ప్రాంతాల్లో జరుగుతుందని తెలిపారు. తటస్థ రంగులు వేసి తమ ముందుకు తీసుకురావాలని తెలిపామని.. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ధర్మాసనానికి తెలిపారు. సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి ఫొటోకు మాత్రమే అనుమతినిచ్చిందని తెలిపారు. బియ్యం పంపిణీ నిలువరించటం తమ ఉద్దేశ్యం కాదని.. నిష్పాక్షికంగా ఎన్నికలు జరపాలనే రంగులు మార్చాలని సూచించినట్లు వాదనలు వినిపించారు. ఇరువురు వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను మార్చి 15కు వాయిదా వేసింది. అప్పటివరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
ఇవీ చూడండి:
హై కోర్టులో ఎమ్మెల్యే జోగి రమేష్ పిటిషన్.. విచారణ మధ్యాహ్నానికి వాయిదా