శ్మశానంలో ఇళ్ల స్థలాలు కేటాయించి... తమకంటూ శ్మశానం లేకుండా చేశారంటూ.. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం బాలవరంలో ఓ వర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీకి రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామశివారు బాలవరం గ్రామంలో ఒక వర్గానికి చెందిన శ్మశాన వాటికను ఎంపిక చేశారు. దానిని గ్రామస్థులు, గ్రామ పెద్దల అంగీకారంతో ఇళ్ల స్థలాలుగా అభివృద్ధి చేశారు. అదే గ్రామంలో మరో వర్గానికి చెందిన శ్మశానాన్ని ఇరు వర్గాలు ఉపయోగించుకోవాలని సూచించారు.
జి. దొంతమూరు గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలు మరణించగా.. ఆమె వర్గానికి చెందిన వారు, బంధువులు తమ ఆనవాయితీ ప్రకారం ఇళ్ల స్థలాల కోసం అభివృద్ధి చేసిన స్థలంలోనే ఖననం చేసేందుకు సిద్ధమవ్వగా, అభివృద్ధి చేసిన స్థలంలో ఖననం చేయొద్దని అధికారులు, మరొక వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అయితే.. రంగంపేట తహశీల్దార్ వై.జయ వారితో చర్చలు జరిపి మరొక స్థలాన్ని తాత్కాలికంగా కేటాయిస్తున్నట్టు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వగా మహిళలు వెళ్లిపోయారు. మిగిలిన వారు కొత్తగా కేటాయించిన స్థలంలో ఖననానికి ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: