రాజమహేంద్రవరానికి చెందిన కందిమళ్ల వేణుగోపాల్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె సాయి తేజస్విని, కుమారుడు వేదసాయిదత్. ఉద్యోగం రీత్యా కెన్యాలో ఉండేవారు. వేదసాయిదత్ 2002, డిసెంబరు 19న జన్మించాడు. ఆరు నెలల వయసు నుంచి మానసికంగా ఎదుగుదల కనిపించ లేదు. కుమారుడుకి మెరుగైన వైద్యం అందించేందుకు శ్రీదేవి అతడిని తీసుకుని స్వస్థలం చేరుకున్నారు. పదమూడున్నరేళ్ల పాటు వివిధ రకాల వైద్య సేవలు అందించారు. నిత్యం భుజాలపై వేసుకుని కనుపాపలా చూసుకున్నారు. చివరకు 2016, ఏప్రిల్ 5న శాశ్వతంగా దూరమయ్యాడు. కోరుకొండ మండలం కణుపూరు సమీపంలో తమ తోటలో అంత్యక్రియలు నిర్వహించి సమాధి నిర్మించారు. అక్కడే సుందరమైన మందిరాన్ని ఏర్పాటు చేశారు.
సేవల్లో ప్రతిరూపం..
కొండల మధ్య ఆహ్లాదకరమైన తోటలో ఎకరం విస్తీర్ణంలో సర్వాంగసుందరంగా సుమారు రూ.45 లక్షల వ్యయంతో వేదసాయిదత్ మందిరం నిర్మించారు. ట్రస్ట్ ఏర్పాటు చేసి మరో రూ.40 లక్షల వరకు వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగించారు. ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. 2016లో నిర్మాణం చేపట్టిన నుంచి దేవుళ్ల ఆలయాల్లో మాదిరిగా నిత్య ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ప్రతి నెలా 5, 19 తేదీల్లో అన్నదానం నిర్వహిస్తున్నారు. ఏటా జరిగే జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో బంధుమిత్రులతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. పదిమందికి చేసే మేలులోనే కుమారుడిని చూసుకుంటూ ముందుకు సాగుతున్నామని ఆ దంపతులు పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య