కరోనా ప్రభావంతో చెన్నై జంతు ప్రదర్శనశాలలో ఓ సింహం మృత్యవాతపడటం.. హైదరాబాద్ జంతప్రదర్శనశాలలో సింహాలకు కరోనా సోకడం వంటి సంఘటనలతో తిరుపతి జంతుప్రదర్శనశాల అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి జూలో ఉన్న జంతువులు, పక్షులు, సరీసృపాలను కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద జంతు ప్రదర్శనశాలగా గుర్తింపు పొందడంతో పాటు.. 89 రకాలకు చెందిన 1100 జంతువులతో సందర్శకులకు ఆకట్టుకొంటున్న ఎస్వీ జంతుప్రదర్శనశాలలో జంతువులకు కరోనా సోకకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు.
సందర్శకులను పూర్తిగా నిలిపివేసిన అధికారులు జంతువులకు పెట్టే ఆహార పదార్థాల ద్వారా కరోనా సంక్రమించకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. పక్షులకు వేసే కాయగూరలు, ఆకు కూరలతో పాటు శాఖాహారానికి సంబంధించిన ఇతర వస్తువులను తొలుత ఉప్పునీటితో, తర్వాత మంచినీటితో శుభ్రం చేస్తున్నారు. మొదటి దశ కరోనా సమయం నుంచి కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నప్పటికీ రెండో దశ సమయంలో పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
జంతువులకు పెట్టే ఆహార పదార్థాలను శుద్ధి చేయడంతో పాటు జూలో పనిచేసే సిబ్బంది సైతం తగిన జాగ్రత్తలు తీసుకొనేలా చర్యలు తీసుకొన్నారు. విధులకు హాజరయ్యే ఉద్యోగులను జూ ప్రవేశ ద్వారం వద్దనే శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించడంతో పాటు ఆటోమేటిక్ డిస్ ఇన్ఫెక్షన్ ఛాంబర్ ద్వారా లోపలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఓ వైపు సిబ్బందిని డిస్ఇన్ఫెక్షన్ చేసిన తర్వాత విధులను హాజరయ్యేలా చర్యలు చేపట్టడం....మరో వైపు జంతువుల ఆహార పదార్థాలను శుద్ధి చేస్తూ.. జంతువులు ఉండే ప్రాంతాలను వైరస్ రహితంగా తీర్చిదిద్దుతున్నారు.
ఇదీ చదవండి:
Sachivalayam: 13 నెలలుగా అద్దె చెల్లించడంలేదంటూ.. గ్రామ సచివాలయానికి తాళం!