NARA LOKESH PADAYATRA ROUTE MAP : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగమే ఏజెండాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేపట్టనున్న సంగతి విధితమే. రోజుకు 10కిలో మీటర్ల చొప్పున.. 400 రోజులు.. 4000 వేల కిలో మీటర్లు యాత్ర చేయనున్నారు. అయితే కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ సాగనున్న ఈ పాదయాత్ర రూట్ మ్యాప్ విషయంలో సందిగ్ధత నెలకొంది. తాజాగా ఆ గందరగోళానికి తెరదించుతూ లోకేశ్ యువగళం మహా పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది.
ఈ నెల 27న మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. తొలి 3 రోజులు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
![LOKESH PADAYATRA ROUTE MAP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17473863_map1.jpg)
వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఓల్డ్ పేట్ మసీదులో ప్రార్థనలు చేసి ముస్లిం మైనారిటీ నేతలతో లోకేశ్ సమావేశం అవుతారు. కుప్పం బస్టాండ్, పార్టీ కార్యాలయం, ట్రాఫిక్ ఐల్యాండ్ జంక్షన్, కుప్పం ప్రభుత్వాస్పత్రి క్రాస్ రోడ్, శెట్టిపల్లి క్రాస్ల మీదుగా పీఈఎస్ కళాశాల వరకు తొలిరోజు పాదయాత్ర సాగనుంది.
![LOKESH PADAYATRA ROUTE MAP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17473863_map-2.jpg)
ఈనెల 28న పీఈఎస్ కళాశాల నుంచి శాంతిపురంలోని అరిముతనపల్లి వరకు సాగనుంది. ఈనెల 29న అరిముతనపల్లి నుంచి చెల్డిగానిపల్లె వరకు జరగనుంది. కుప్పంలో మూడు రోజుల పర్యటన నేపథ్యంలో 29 కిలో మీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర సాగనుంది.
![LOKESH PADAYATRA ROUTE MAP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17473863_map-3.jpg)
రాష్ట్ర ప్రభుత్వం సభలు, ర్యాలీలు నిషేధిస్తూ జీవో నెంబర్ 1 ను తీసుకొచ్చింది. ర్యాలీలు బహిరంగ సభలు చేపట్టాలంటే పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించింది. అయితే ఈ జీవోలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. చీకటి జీవో తెచ్చి ప్రజల సమస్యలు తీర్చడానికి వీలు లేకుండా చేశారని ఆగ్రహించారు. జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. జీవోను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 23 వరకు జీవోను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో పై తదుపరి ఆదేశాలు 23 తర్వాత వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది.
హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే.. లోకేశ్ పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తారేమో అనే గందరగోళం టీడీపీ శ్రేణుల్లో కాస్తా కలవరం రేపుతోంది. ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. పాదయాత్రపై ఏలాంటి నిర్ణయాలు తీసుకుంటదనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ఇవీ చదవండి: