తిరుపతి వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చేయూతనివ్వాలని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సంస్థ ప్రతినిధుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి కే.రాజేంద్రకుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే.. బాధితులకు శుక్ర, శనివారాల్లో తాగునీరు, పాలు, బ్రెడ్, భోజన ప్యాకెట్లు అందించినట్లు కూడా ఆయన వెల్లడించారు.
"ప్రకృతి బీభత్సంతో అతలాకుతలమైన తిరుపతి ప్రాంతంలో సేవా కార్యక్రమాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు నడుం కట్టింది. చిత్తూరు జిల్లాలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తెలుగురాష్ట్రాల్లో ఎప్పుడు ప్రకృతి వైపరిత్యాలు సంభవించినా ఎన్టీఆర్ ట్రస్టు ముందుకొచ్చి ఆదుకుంటోంది. ఎన్టీఆర్ ఆదర్శాలైన సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు నినాదం స్ఫూర్తిగా 24ఏళ్ల నుంచి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను ట్రస్టు నిర్వహిస్తోంది." అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: TDP Agitation: మున్సిపల్ అధికారులపై కేసు నమోదు చేయాలి : తెదేపా