కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఉద్యోగులు, సిబ్బంది విధులకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. శ్రీసిటీలో పనిచేసేవారు ఎక్కువగా వరదయ్యపాళెం, సత్యవేడు, బి.ఎన్.కండ్రిగ, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట, తమిళనాడులో నివసిస్తుంటారు. మొన్నటివరకు సత్యవేడు నియోజకవర్గంలో పెద్దగా కొవిడ్- 19 కేసులు నమోదు కాకపోవడంతో.. శ్రీసిటీకి యథావిధిగా కార్మికులు హాజరవుతారని భావించారు.
కోయంబేడు కాంటాక్టులు పెరుగుతుండటంతో వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. సమీపంలోని నాయుడుపేట, సూళ్లూరుపేట, నాగలాపురంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో సైతం ఇదే పరిస్థితి. ఫలితంగా కార్మికుల హాజరు శాతం తక్కువగా ఉంది.
గత వారంతో పోలిస్తే పర్వాలేదని, ఇప్పుడు కొంత ఎక్కువగా వస్తున్నారని పరిశ్రమల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరో రెండు వారాల్లో పరిస్థితి మెరుగుపడి.. ఉద్యోగుల హాజరుశాతం పెరగవచ్చని ఆశిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం అంగీకరిస్తే.. అక్కడి నుంచి శ్రీసిటీకి బస్సులు నడపాలనే యోచనలో ఉన్నారు.
కొన్ని పరిశ్రమలు మాత్రం ఉత్పత్తి ఎక్కువగా చేసినా.. కొనుగోళ్లు లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఆలోచనతో ఉన్నాయి. దీంతో నామమాత్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. జిల్లాలోని కొన్ని కర్మాగారాలకు రవాణా సమస్య కారణంగా ముడి సరకు అంతగా లభ్యం కావడం లేదు.
ఉద్యోగుల మానసిక స్థితి కీలకం
పరిశ్రమల్లో విధులు నిర్వర్తించే కార్మికులు, ఉద్యోగులు రెండు నెలలు లాక్డౌన్లో ఉన్నందున.. వారి మానసిక స్థితిని గమనించాలి. ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించేటప్పుడు మొదట ట్రయల్రన్ చూడాలి. కార్మికులకు మరోసారి శిక్షణ ఇవ్వాలి. వారు పనికి వచ్చేటప్పుడే థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- శివకుమార్రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్
- పరిశ్రమల శాఖ పరిధిలో నమోదైన భారీ పరిశ్రమలు: 150
- ఉపాధి పొందుతున్న వారి సంఖ్య: 1,11,269
- పరిశ్రమల శాఖ పరిధిలోని ఎంఎస్ఎంఈలు 500
- బ్యాంకు రుణాలు, అనుమతులతో నిమిత్తం లేని ఎంఎస్ఎంఈలు: 7,600
- ఉపాధి పొందుతున్న వారు: 71,379
- ప్రస్తుతం హాజరవుతున్న సిబ్బంది: 30- 35 శాతం
ఇదీ చదవండి: