చిత్తూరు నగరంలోని ఓ బంగారు ఆభరణాల దుకాణం యజమాని నివాసంలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని దుర్గమ్మ గుడి సమీపంలో ముద్దాయి నార బసవరాజు అలియాస్ రాజును అరెస్ట్ చేశారు. పెద్దపుజర్ల గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూల్ జిల్లాకు చెందిన బసవరాజు నుంచి 500 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
కారు స్వాధీనం..
కొంత బంగారు నగలు విక్రయించి నిందితుడు కొనుగోలు చేసిన కారును స్వాధీనం చేసుకున్నారు. చోరీ ఆభరణాల మొత్తం విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని జిల్లా ఏఎస్పీ మహేశ్ తెలిపారు.
20 ఏళ్లుగా చోరీలే..
నార బసవరాజు గత 20 సంవత్సరాలుగా ఇళ్లల్లో దొంగతనాలు, మూడు హత్యలు చేసి జైలుకు సైతం వెళ్లాడని ఏఎస్పీ వివరించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని హబీబ్నగర్, సికింద్రాబాద్ గాంధీ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రొద్దుటూరు టౌన్, ఖమ్మం టౌన్ తదితర కాలనీల్లోని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడినట్లు స్పష్టం చేశారు.