ఎన్నికల ప్రచారంలో సామాజిక మాధ్యమాలతో పాటు ఇతర వేదికలపై రాజకీయ పార్టీలు పరస్పరం చేసుకుంటున్న విద్వేష పూరిత ప్రకటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓటర్లను భయాందోళనలకు గురిచేసేలా ఉండటం వలన ఈసీ ఈ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకూ నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం... వారిచ్చిన సమాధానాలను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకోనుంది. ప్రత్యేకించి కులమతాలపై విద్వేష పూరిత ప్రకటనలు సరికాదని భావిస్తున్న ఈసీ రాజకీయ పార్టీలపై నేరుగా కేసులు నమోదు చేయనుంది. ఈ ప్రకటనలపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153ఏ తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం లోని సెక్షన్ 125 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.
ఏ పెన్నుతో అయినా సంతకం చేయవచ్చు
మరోవైపు నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్ధులు సమర్పించే బి-ఫాంపై ఏ పెన్నుతో సంతకం చేసినా అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో కొందరు రిటర్నింగ్ అధికారులు గందరగోళానికి గురైయ్యారని ఆయన అన్నారు. నీలి, నలుపు రంగుల పెన్నులతో అభ్యర్థులు అఫిడవిట్లు, బి-ఫాంపై సంతకం చేసుకునే వీలుందని ద్వివేది వివరించారు. నామినేషన్లను ఆమోదించటంలో రిటర్నింగ్ అధికారే నిర్ణయమే కీలకమని ఆయన స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారి వద్ద ఏదైనా తప్పుదొర్లితే నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సిందేనని తెలిపారు.
ఇవీ కూడా చూడండి
అత్యధిక రిటర్న్ క్యాచ్లతో హర్భజన్ రికార్డు
నకిలీ పోస్టులు పెడితే కఠిన చర్యలు
ఎన్నికల సందర్భంగా చేసే ఎన్నికల సర్వేలు, వాటి విశ్లేషణల వెల్లడి.. నిబంధనల పరంగా ఉల్లంఘన కింద రాదని ద్వివేది తెలిపారు. అయితే ఎగ్జిట్ పోల్స్ వివరాల విడుదల మాత్రమే నిబంధనల అతిక్రమణ కిందకు వస్తుందన్నారు. పోలింగ్ జరిగే ఇతర ప్రాంతాలపై అది ప్రభావం చూపించే అవకాశముందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో నకిలీ పోస్టింగ్లు పెట్టి తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని అన్నారు. సి-విజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు 50 శాతం మేర నకిలీవేనని ద్వివేది వివరించారు. పోలింగ్ రోజున సాంకేతిక పరంగా ఈవీఎంలకు వచ్చే సమస్యల్ని పరిష్కరించేందుకు 600 మంది నిపుణులను రప్పిస్తున్నామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఓ సాంకేతిక నిపుణుడిని అందుబాటులో ఉంచుతామన్నారు.
ఇవీ చూడండి