Vadaanya Charitable Organization Helps to Students : ప్రతిభ ఉన్నా కానీ, పేదరికం వల్ల పదో తరగతితోనో, ఇంటర్తోనో చాలా మంది విద్యార్థులు చదువును ఆపేస్తున్నారు. అలా ఆగిపోకూడదనే లక్ష్యంగా అనంతపురంలో స్థాపించిన వదాన్య జన సొసైటీ సంస్థ ఇప్పటి వరకు అనేక మంది యువతను తీర్చిదిద్ది స్వంత కాళ్లపై నిలబడేలా చేయూతనిస్తోంది. ఈ సంస్థకు దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఆర్థిక ప్రోత్సాహం అందించి.. నిరుపేద విద్యార్థులను విద్యావంతులు, ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నిరుపేదలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో దాదాపు 12 ఏళ్ల క్రితం వదాన్య సొసైటీ ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వేతనం నుంచి 0.5 శాతం పేద యువత చదువు కోసం వెచ్చించాలనే లక్ష్యంగా ఈ సొసైటీ ప్రారంభమైంది. ఇప్పటికే వందలాది పేద యువతీ, యువకులను ఈ సంస్థ ద్వారా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది జీవితంగా స్థిరపడేలా చేశారు.
మారుమూల గ్రామాల్లో చదువుకోవాలనే కోరిక ఉండి కూడా ఆర్థిక స్థోమత లేక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు. వారంతా చదువుల్లో ప్రతిభ చూపిన ఆర్థిక పరిస్థితుల కారణంగా పై చదువులను అభ్యసించలేకపోతున్నారు. అలాంటి వారిని గుర్తించి.. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తుంది ఈ సంస్థ. ఇంటర్ విద్య నుంచి పై చదువులకు ఆర్థిక చేయూత, కెరియర్ గైడెన్స్ అందిస్తుంది.
ప్రతి ఏటా వంద నుంచి 200 మంది విద్యార్థులకు అండగా నిలుస్తుంది ఈ సంస్థ. అలా ఈ ఏడాది నిర్వహించిన పోటీ పరీక్షలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి 6 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల జాబితా పలు దేశాల్లోని వాళ్లందరికీ వెళ్తుంది. ఆయా దేశాల్లోని వృత్తి నిపుణులు, కెరియర్ గైడ్లు వీరితో వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడి వారి లక్ష్యాలను తెలుసుకుంటారు.
"డిగ్రీ పూర్తి చేసుకుని తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో.. నాకు వదాన్య సోసైటీ పరిచయమైంది. నేను చదువుకున్న సమయంలో ఆర్థిక సమస్యల ఉండేవి. వదాన్య నాకు చేయూతనిచ్చింది." -మహేశ్ నాయక్, ఉద్యానశాఖ అధికారి
"వదాన్య నాకు మానసికంగా చాలా సపోర్ట్ ఇచ్చింది. నా ఉన్నత లక్ష్యం సివిల్స్ సాధించటం. ఇప్పటికే నేను మూడు ఉద్యోగలు సాధించాను." - రాజు నాయక్, రైల్వే ఉద్యోగి
విద్యార్థి కెరీర్ కోసం ఎంతవరకు చదివినా.. అంతవరకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది వదాన్య సొసైటీ. ఈ తరహా చేయూత అందుకున్న వారిలో చాలా మంది యువత రెండు, మూడు ఉద్యోగాలు సాధించి, వారికి ఇష్టమైన ఓ ఉద్యోగంలో స్థిరపడుతున్నారు.
"నేను బీటేక్ పూర్తి చేశాను. నేను పట్టి పెరిగింది అంతా గ్రామీణ ప్రాంతంలో. నేను బీటెక్ మూడోవ సంవత్సరం చదువుతున్న సమయంలో నాకు వదాన్య గురించి తెలిసింది. నాకు వదాన్య అందిస్తున్న సహాయం వల్లే నేను పోటీ పరీక్షలకు ప్రీపేర్ అవుతున్నాను."- నంజమ్మ, విద్యార్థిని
12ఏళ్లుగా అంచలంచలుగా విస్తరిస్తున్న వదాన్యకు వందలాది మంది ఆర్థిక సహాయం అందించటానికి ముందుకు వస్తున్నారు. ఈ సంస్థ సహాయం అందించే ప్రతివిద్యార్థిపై పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండటంతో కొందరు కెరియర్ గైడ్ లేదా దాతలుగా మారుతున్నారు. దీంతో వదాన్య నుంచి సహాయం పొంది.. స్థిరపడిన యువతి, యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
"అమ్మాయిల తల్లిదండ్రులకు వదాన్య వాళ్లు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అమ్మాయిల భవిష్యత్ ఎలా ఉంటే బాగుంటుందో వారు తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. అమ్మాయిలకు చదువు ఎంత ప్రధానమైందో వివరిస్తున్నారు."
-రాధిక, సాఫ్ట్ వేర్ ఉద్యోగిని
చదువు పూర్తి చేసుకొని ఒకసారి ఉద్యోగం పొందిన వారు అదే సంస్థకు దాతలుగా మారటం మంచి పరిణామం. పకడ్బంధీ ఆర్థిక ప్రణాళిక, యువతకు కెరియర్ గైడెన్సు ఇస్తున్న కారణంగా వదాన్య తన లక్ష్యాలను పూర్తిచేస్తోంది. నిరుపేద విద్యార్థులను ఎంపిక చేసుకొని, వారికి అవసరమైన అన్ని విధాలా చేయూత ఇస్తూ వదాన్య జనసొసైటీ తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామాలకు వెళుతోంది. ఆ సంస్థ అందించిన ఆర్థిక, విద్యాపరమైన ప్రోత్సాహంతో ఎంతోమంది యువత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటమే కాకుండా ఉన్నత చదువులతో ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు.
"బాగా చదవగల సామర్థ్యం ఉండి వారికి ఎవైనా సమస్యలు ఉన్నాయని.. మాకు తెలిస్తే వారికి ఆర్థికంగా, మానసికంగా సహాయం చేస్తాము. ఉన్నత చదువుల్లో ఏ కోర్సులు చదవాలి. ఏ కోర్సులు చదివితే బాగుంటుంది అనే అంశాలను వివరిస్తాము. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్, కెరియర్ గైడెన్స్ లాంటి అంశాల్లో సహాయం చేస్తాము." -అశోక్, వదాన్య జనసొసైటీ వ్యవస్థాపకులు
ఇవీ చదవండి :