నాలుగు నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవటంతో ఒప్పంద ఉపాధ్యాయుడు వారాంతపు సంతలో కూరగాయలు అమ్ముతున్నాడు. అనంతపురం జిల్లా నూతిమడుగు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో మురళీ మోహన్ ఒప్పంద ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం తమకు నాలుగు నెలలుగా వేతనాలు నిలిపివేసిందని ఉపాధ్యాయుడు వాపోతున్నాడు. విధిలేని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోవటానికి సంతలో కూరగాయలు అమ్ముతున్నట్లు తెలిపారు.
తనకు వేరే ఉపాధి మార్గం లేదని.. తన తల్లిదండ్రులను పోషించుకోవటానికి ఇంతకన్నా గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేసి వారాంతపు సంతలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమ పరిస్థితిని గమనించి వేతనాలు మంజూరు చేయాలని కోరుతున్నారు.