రాయలసీమ జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వానలు కురిశాయి. ఎండ తీవ్రతకు అతలాకుతలమవుతున్న జనాలు ఒక్కసారిగా చల్లటి వాతావరణానికి పులకరించిపోయారు. పలు చోట్ల అకాల వర్షాల కారణంగా రవాణా స్తంభించిపోయింది. దీంతో పాటు అక్కడడక్కడ పిడుగులు పడ్డాయి. రానున్న మూడు రోజుల పాటు ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
పిడుగు పాటుకు ఎద్దులు మృతి..
![rains in seema](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11721815_yeddulu.jpg)
కర్నూలు జిల్లా నందవరంలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృతి చెందాయి. గ్రామంలోని తలమారి రాజుకు చెందిన ఎద్దులను తన ఇంటి ముందు కట్టి ఉంచగా.. పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. చనిపోయిన ఎద్దుల విలువ లక్ష రూపాయలు వరకు ఉంటుందని యజమాని తెలిపాడు. కాడెద్దులు అకాల మృతితో రైతు తీవ్ర ఆవేదన చెందాడు.
ఉపశమనం..
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఒక్కసారిగా కురిసిన వానకు వాతావరణం చల్లబడింది. తీవ్రమైన ఎండలతో సతమతమైన జనాలు వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. ఈదురు గాలుల కారణంగా కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: