NTR Shopping Complex: అనంతపురం సాయినగర్ ప్రధాన రహదారి ప్రాంతం ఇది. నిత్యం కిక్కిరిసిన ట్రాఫిక్తో రద్దీగా ఉంటుంది. ఈ రహదారిని ఆనుకొని జిల్లా ప్రజాపరిషత్ ప్రహరీ ఉంది. దీన్ని తొలగించి దుకాణ సముదాయం నిర్మిస్తే.. జిల్లా పరిషత్ అవసరాలకు ప్రతినెలా అద్దె వస్తుందని గత ప్రభుత్వంలో జడ్పీ పాలక వర్గం నిర్ణయం తీసుకుంది. ఆ దుకాణాలను పేద యువతతో పాటు, దివ్యాంగులైన వారికి కేటాయిస్తే ఉపాధి కల్పించినట్లు అవుతుందని భావించింది. ఆ మేరకు 2019లో 40 లక్షల రూపాయల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు.
అందులో 12 షాపులు కట్టారు. దానికి, ఎన్టీఆర్ పేరుపెట్టారు. అప్పట్లో మంత్రుల హోదాలో కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత ప్రారంభించారు. వీటిని..అద్దె ప్రాతిపదికన కేటాయించే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో.. ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ షాపుల షెట్టర్లు తెరిచిన పాపానపోలేదు.
సాయినగర్లో చిన్నపాటి దుకాణం అద్దెకు తీసుకోవాలన్నా కనీసం 7నుంచి 10 వేలు పెట్టాలి. జడ్పీ ప్రాంగణంలో ఉన్న షాపులు 120 నుంచి 180 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ దుకాణాలు.. నిరుపయోగంగా ఉంచడంతో గోడలకు పగుళ్లు వచ్చాయి. వీటిని కేటాయించాలంటూ.. జిల్లా పరిషత్ అధికారులకు అనేక విజ్ఞాపనలూ వెళ్లాయి. కానీ అవన్నీ పాలకపక్షం చెవికెక్కించుకోలేదు. కేవలం ఎన్టీఆర్ పేరు పెట్టడం వల్లే.. వీటిని అందుబాటులోకి తేవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆర్థిక సంఘం నిధులు నేరుగా స్థానిక సంస్థలకే ఇస్తున్న వేళ.. జిల్లా పరిషత్లు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయ వనరులు సమకూర్చుకునే వెసులుబాటు ఉన్నా.. జడ్పీ పాలక వర్గం ఆ దిశగా ఆలోచన చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Chintalapudi Area Hospital: మూడేళ్లుగా పనులు.. పూర్తయ్యేది ఎన్నడో.. రోగుల ఎదురుచూపులు
"కేవలం ఎన్టీఆర్ జిల్లా ప్రజాపరిషత్ కాంప్లెక్స్ అని పేరు ఉన్న కారణంగా దీనిని ప్రారంభించడం లేదు. అనంతపురంలో ఉన్న ప్రజాప్రతినిధికి ఈ సందర్భంగా చెప్తున్నాం.. రాజకీయాలకు అతీతంగా ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేయాలని కోరుతున్నాం. స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టి అయినా దీనిని ప్రారంభించాలి. జిల్లా పరిషత్ ఛైర్మన్ కూడా దీనిపై స్పందించాలి". - పృధ్విరాజ్, నిరుద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు
"రాజకీయాలకు సంబంధించిన పేరు ఉంది అని.. షాప్లు ప్రారంభించకపోవడం చాలా దారుణం. ఏంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. వారంతా ఈ షాప్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటువంటి దగ్గర రాజకీయాలు చేయడం మంచిది కాదు. కాబట్టి అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం". - ఉమామహేశ్వరి, ఎస్సీ,ఎస్టీ జేఏసీ సంఘం జిల్లా నాయకురాలు