వేరుశెనగ పంటనే నమ్ముకున్న అనంతపురం జిల్లా రైతులకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు ఎక్కువగా పడటంతో.. సంతోషపడిన రైతులకు ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.
దేశంలో వేరుశెనగ పంటను అధికంగా పండించే ప్రాంతాల్లో అనంతపురం జిల్లా ప్రధానమైనది. జిల్లాలో సుమారు ఐదున్నర లక్షల హెక్టార్లలో వేరుశెనగను సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 12 లక్షల 20 వేల ఎకరాల్లో రైతులు పంటను వేశారు. సకాలంలో వర్షాలు పడటంతో అప్పు చేసి మరీ రైతులు వేరుశెనగ సాగు మెుదలుపెట్టారు.
వర్షాలు ఎక్కువగా పడి ఎటు చూసినా పచ్చదనమే కనిపించటంతో.. రైతులు ఎంతో సంతోషించారు. అయితే పంట పొలాల్లో వేరుశెనగ పంటను తొలగించి చూస్తే.. వేరుశెనగ కాయలు కనిపించలేదు. ఒక్కో చెట్టుకు రెండు మూడు కాయలే కాశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వర్షాల వలనే పంట పండలేదని రైతులు వాపోయారు. జూన్ నెలలో సాగైన పంటను అధిక వర్షాలు దెబ్బతీశాయని రైతులు వివరించారు.
ఇలా సగం పంటను అధిక వర్షాలు దెబ్బ తీస్తే.. మరో సగం పంటను వర్షాభావం కాటేసింది. జూన్ నెలలో 63.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా.. 106 మిల్లీ మీటర్లు కురిసింది. అంటే 67 శాతం ఎక్కువ వర్షపాతం పడింది.జులై నెలలో సైతం రికార్డు స్థాయిలో 147 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. కానీ వర్షం అవసరమైన ఆగస్టు నెలలో వర్షం పడలేదు. ఆగస్టు చివరి వారానికి 70 మిల్లీటమీటర్లు వర్షం కురవాల్సి ఉండగా.. కేవలం 49 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది.
దీనివల్ల ఆగుస్టులో వేసిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. నీరున్న ప్రాంతాల్లో తుంపర సేద్యం ద్వారా వేరుశెనగ చెట్లను తడుపుతున్నారు.
-జిల్లాలో 3 దశల్లో వేసిన పంటల పరిస్థితిపై 4 రోజులుగా క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఎక్కడ చూసిన ఎకరాకు 2 నుంచి 5 బస్తాలకు మించి దిగుబడి వచ్చే పరిస్థితులు కనిపించటం లేదు. జిల్లాలో 12లక్షల 20వేల ఎకరాలు పంట సాగు చేయగా.. ఎకరాకు 16వేల రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టటంతో.. 1980కోట్ల వరకు ఖర్చైంది. ఇందులో 70శాతం వరకు పంట దెబ్బతింది. 8లక్షల 40వేల ఎకరాల్లో పంట దెబ్బతిందని అంచనా వేస్తున్నారు. అంటే పెట్టుబడుల రూపంలోనే 14వందల కోట్ల వరకు రైతులు నష్టపోయారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే బాలకృష్ణకు తెదేపా కార్యకర్తల ఘన స్వాగతం