Corporators: అనంతపురం నగరపాలక సంస్థ కార్పొరేటర్లు ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు స్టడీ టూర్కు సిద్ధమయ్యాయి. ఇందోర్, ఆగ్రా, దిల్లీ నగరాలతో అనంతపురం నగరానికి ఏమాత్రం పోలిక లేకపోయినా.. ఆయా చోట్ల పర్యటనకు వెళ్తున్నారు. అనంత నగరపాలక సంస్థలో కేవలం 3లక్షల 31వేల జనాభా ఉన్నారు. కానీ 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలలో ఘన వ్యర్థాల నిర్వహణను పరిశీలించటానికి కార్పొరేటర్లు, అధికారులు పర్యటన పెట్టుకోవడం విమర్శలకు తావిస్తోంది.
ఒక్కో కార్పొరేటర్కు నగరపాలక సంస్థ జనరల్ ఫండ్ నుంచి 52వేల777 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 50 మంది కార్పొరేటర్లు, ఐదుగురు కోఆప్షన్ సభ్యులతో పాటు 9మంది అధికారులు, వీరికి సేవలు అందించే సిబ్బంది ఈ యాత్రకు వెళ్తున్నారు. దాదాపు 40 లక్షల రూపాయలు ఈ యాత్రకు ఖర్చుచేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు.. మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మట్టి ఖర్చు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారని కార్మికుల కుటుంబసభ్యులు వాపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్లో ఆగ్రా 23వ స్థానంలో, దిల్లీ 28వ స్థానంలో అట్టడుగున ఉన్నాయి. ఇందోర్ తొలి స్థానంలో ఉన్నప్పటికీ.. అక్కడి జానాభాతో అనంత నగరపాలక సంస్థకు ఏమాత్రం సారూప్యత లేదు. పారిశుద్ధ్య కార్మికులకు చీపుర్లు కొనటానికే నిధులు లేవంటూ.. కార్పొరేటర్లు యాత్రలు చేయడమేంటంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు 50 మంది కార్పొరేటర్లు, ఐదుగురు కోఆప్షన్ సభ్యుల్లో 30 మంది మహిళలు ఉన్నారు. వీరంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి వస్తామని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే నిబంధనలు అనుమతించవని, వీరితో పాటు వచ్చే కుటుంబసభ్యులు ఒక్కొక్కరు 30 వేల రూపాయలు చెల్లించాలని చెప్పినట్లు ఆరోపణలున్నాయి.
ఇవీ చదవండి: