నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయాలని అనంతపురం జిల్లా పెనుకొండలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సీఐటీయూ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. కార్మికులను కట్టుబానిసల్లాగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
పాలకొండలో...
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా పాలకొండలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ.. ఆహార భద్రతకు నష్టం చేసే 3 వ్యవసాయ నల్ల చట్టాలు, కేంద్ర విద్యుత్ సవరణ చట్టం, కార్మికులను కట్టుబానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మైలవరంలో...
కృష్ణాజిల్లా మైలవరంలో కేంద్రప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజీల్ ధరలు కొండెక్కి సామాన్యుల జీవితాల్ని కష్టతరంగా మార్చాయని సీఐటీయూ మండల కార్యదర్శి చాట్ల సుధాకర్ తెలిపారు.
విశాఖలో...
మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నర్సింగరావు అన్నారు. ఈ మేరకు విశాఖ మహానగరపాలక సంస్థ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉదయగిరిలో...
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక, విద్యార్థి వ్యతిరేక పాలన ప్రజలు ఎండగట్టాలని పిలుపునిస్తూ ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయం సీఐటీయూ నాయకులు నోటికి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కరోనా సేవలందిస్తున్న కార్మికులు, ఉద్యోగులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు.
ఇదీచదవండి: కాసేపట్లో నీతిఆయోగ్ వైస్ఛైర్మన్ రాజీవ్కుమార్ను కలవనున్న సీఎం జగన్