అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామ సమీపంలో వాగు దాటుతూ ప్రమాదవశాత్తు గల్లంతైన రామసుబ్బమ్మ మృతదేహాన్ని రెండు రోజుల తర్వాత వరదాయిపల్లి చెక్ డ్యాంలో గ్రామస్థులు గుర్తించారు.
పింఛన్ కోసం వెళ్తూ..
వరదాయిపల్లికి చెందిన రామసుబ్బమ్మ ఈ నెల 1న పింఛన్ తీసుకునేందుకు తాడిపత్రి నుంచి వరదాయిపల్లి గ్రామానికి వెళ్తూ ప్రమాదవశాత్తు చుక్కలూరు గ్రామ సమీపంలోని వాగు దాటుతూ నీటి ప్రవాహంలో పడిపోయింది. బాధితురాలిని రక్షించేందుకు స్థానిక యువత ఎంత శ్రమించినా వృద్ధురాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.
ఎంత గాలించినా..
ఫలితంగా గ్రామస్థులు, అగ్నిమాపక , పోలీస్ సిబ్బంది, వాగు వెంబడి గాలిస్తూనే ఉన్నారు. వరదాయిపల్లి గ్రామంలోని చెక్ డ్యాంలో మృతదేహం ఉన్నట్లుగా గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వెలికి తీసి పోలీసులు రామసుబ్బమ్మగా గుర్తించి మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.