Visaka Fisherman Ring Nets Issue: విశాఖ జిల్లాలో మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం ఇంకా సద్దుమణగ లేదు. మత్స్యకారుల మధ్య రాజీకి ఈరోజు చేసిన యత్నాలు కూడా ఫలించలేదు. రింగ్ వలల వివాదంపై విశాఖ కలెక్టరేట్లో ఆర్డీవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో ఇరు వర్గాల ప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు సమావేశమయ్యారు. జీవో ప్రకారం వేట కొనసాగిస్తే.. తమకు ఉపాధి దక్కటం కష్టమవుతోదంని రింగ్ వలల మత్స్యకారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ..వారు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఇరు వర్గాల వాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ వివాదం త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూస్తామని ఆర్డోవో స్పష్టం చేశారు.
అసలు ఏమిటీ వివాదం..?
సాధారణంగా మూడు రకాల బోట్లపై మత్స్యకారులు చేపల వేట సాగిస్తారు. సంప్రదాయ మత్స్యకారులు తెప్పలు, మరికొందరు ఇంజిను బోట్లు, ఇంకొందరు మరపడవలను ఉపయోగిస్తారు. మరపడవలు తీరం నుంచి 15కిలోమీటర్లు పైబడి, తెప్పలు, ఇంజిను బోట్లు 5 కిలోమీటర్ల పరిధిలో వేట సాగిస్తాయి. జిల్లాలో ఒకప్పుడు 132 రింగు వలలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో 52 వలలు విశాఖ చేపల రేవు నుంచి పాయకరావుపేట తీరం వరకు ఉన్నాయి. వారికి లైసెన్సులు ఉన్నప్పటికీ రింగు వలలు వాడడం లేదు. మిగిలిన 80 వలలు ఎండాడ, మంగమారిపేట, భీమిలి మత్స్యకారుల వద్ద ఉన్నాయి. వీటిలో 19 వలలకు మాత్రమే అధికారిక అనుమతులు ఉన్నాయి.కానీ.. లైసెన్సులు ఉన్నవాటి కంటే ఎక్కువగా రింగు వలలను వినియోగిస్తూ ఎండాడ, మంగమారిపేట, భీమిలి మత్స్యకారులు వేట సాగిస్తున్నారనేది ఆరోపణ. వీరిని చినజాలరిపేట, పెద జాలారిపేట మత్స్యకారులు అడ్డుకుంటున్నారు. గత ఏడాది జూన్లో తొలిసారి వివాదం చెలరేగింది. అప్పటిలో పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు జోక్యం చేసుకొని వివాదాన్ని చల్లబర్చారు. కొన్నాళ్ల పాటు వేటను నిషేధించారు. ఆర్డీఓ కోర్టులో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి బైండోవరు చేశారు.
మళ్లీ ఈ నెల 4న రింగు వలల వివాదం తెరపైకి వచ్చింది. విశాఖలోని పెద్దజాలరిపేట, వాసవానిపాలెం మత్స్యకారులు రింగు వలల విషయంలో బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలో 6 బోట్లు తగులబెట్టి.. తమవాళ్లను ఐదుగురిని తీసుకెళ్లారని వాసవానిపాలెం గ్రామస్థులు ఆరోపించారు. తమ వారిని కొట్టడంతోనే బోట్లకు నిప్పంటించామని పెద్దజాలరిపేట వాసుల వాదించారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఫలించని ప్రజాప్రతినిధుల చర్చలు..
గతేడాది జులై నెలలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు గవర్నర్ బంగ్లాలో రెండు వర్గాలతో సమావేశమై చర్చలు జరిపినా.. అవి అంతగా ఫలించలేదు. మళ్లీ ఆగస్టు 28న కలెక్టరేట్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్, మత్స్యశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని ఇరువర్గాలను శాంతిపర్చే ప్రయత్నాలు చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని మంత్రి మత్స్యకార వర్గాలకు సూచించి మిన్నకుండిపోయారు.మళ్లీ సెప్టెంబరు నుంచి రింగు వలలతో వేట ప్రారంభమవడంతో పలుమార్లు ఘర్షణలు జరిగాయి. దీంతో వాటిని నిషేధించాలని కోరుతూ మత్స్యకారులు ధర్నాలు చేశారు. కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. నవంబరు 2న జీవీఎంసీ నుంచి కలెక్టరేట్ వరకు 28 మత్స్యకార గ్రామాలకు చెందిన వారు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. డిసెంబరు నెలలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ను కార్యాలయం వద్ద కొంతమంది మత్స్యకారులు ఆందోళనకు దిగారు. మత్స్యశాఖ అధికారులను దాదాపు 12సార్లు కలిసి వినతులు అందజేశారు.
హైకోర్టు ఆదేశాలు ఏం చెబుతున్నాయంటే..?
రింగు వలల వివాదం రాష్ట్ర హైకోర్టు వరకు వెళ్లింది. దీనిపై గత ఏడాది మే నెలలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వలలు వినియోగించే ఇంజిను బోట్లు తీరం నుంచి 8 కిలోమీటర్లు దాటి వేట సాగించాలని ఆదేశించింది. కొత్తగా అనుమతులు, పునరుద్ధరణ చేయవద్దని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పాటించకుండా కొందరు తీరం నుంచి 3 కిలోమీటర్ల లోపు రింగు వలలను వినియోగిస్తూ వేట సాగిస్తుండడం వివాదానికి కారణమవుతోంది.
అనుమతులు తప్పనిసరి..
బోట్ల నిర్వాహకులు ఎటువంటి వలలు వాడినా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ఎఫ్డీవో) నుంచి అనుమతులు తీసుకోవాలి. ఆయా వలలను చూపించి నిర్ణీత రుసుమును చెల్లించి లైసెన్సు పొందాలి. ఆరేడేళ్ల క్రితం అనుమతులు ఇచ్చిన రింగు వలలనే ఇప్పుడు వాడుతున్నారు. గత రెండేళ్ల నుంచి కొత్త వాటికి మత్స్యశాఖ అనుమతులు ఇవ్వడం లేదు.
ఇదీ చదవండి
DISPUTE BETWEEN FISHERMEN: మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం.. పోలీసు వలయంలో ఆ గ్రామాలు