ఆక్సిజన్ రవాణాలో ఆటంకాలు తలెత్తకుండా.. సకాలంలో రాష్ట్రానికి చేరుకునేలా చూసేందుకు ముగ్గురు సీనియర్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తమిళనాడుకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికళ వలవన్, కర్నాటకకు మరో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాములు, ఒడిశాకు మాజీ ఐఏఎస్ అధికారి ఏకె ఫరిదాలను నియమించినట్లు తెలిపారు. వీరు రెండు వారాలపాటు ఆయా రాష్ట్రాల్లో ఉండి.. ఆక్సిజన్ సరఫరాలో ఎక్కడా ఆలస్యం, ఆటంకాలు తలెత్తకుండా చూస్తారని సింఘాల్ స్పష్టం చేశారు.
ఇండస్ట్రియల్ సిలిండర్లను.. వైద్యవినియోగానికి చర్యలు..
తిరుపతి రుయా ఆసుపత్రి ఘటన దురదృష్టకరమన్న ఆయన.. ఆక్సిజన్ ట్యాంకర్ రాకలో ఆలస్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలిండర్లను వైద్యపరంగా వినియోగించుకోవడానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
టెలీ మెడిసిన్ సేవల్లో 3 వేల 496 మంది వైద్యులు..
అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా, నిర్వహణ పర్యవేక్షణకు తూర్పు నావికాదళం ఏర్పాటు చేసిన నాలుగు బృందాలు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పర్యటించి, సలహాలు సూచనలు అందజేశాయన్నారు. టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా హోం ఐసోలేషన్లో ఉన్న కరోనా బాధితులకు సేవలందించడానికి 3,496 మంది డాక్లర్లు పనిచేస్తున్నట్లు తెలిపారు. వారంతా కరోనా బాధితులకు ఫోన్ చేసి.. ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటూ మందుల వినియోగం, ఇతర సలహాలు సూచనలు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
వ్యాక్సినేషన్ రద్దీ నివారణకు చర్యలు..
కరోనా బాధితులకు ఆసుపత్రుల్లో పడకల కొరత రానీయకుండా ఆసుపత్రుల ఆవరణలో జర్మన్ హ్యాంగర్లతో తక్షణమే తాత్కాలికంగా బెడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాల్లో రద్దీ నివారణకు ఎస్ఎంఎస్లు పంపడం, వాలంటీర్ల ద్వారా సమాచారం అందిస్తున్నట్లు వివరించారు. దీనివల్ల కేంద్రాల్లో రద్దీ నివారణ సాధ్యమవుతోందన్నారు.
కలెక్టర్ల ప్రత్యేక పర్యవేక్షణ..
అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఐసీయూ పడకలు ఖాళీగా లేవని.. వస్తున్న రోగులకు వైద్యం అందించే విషయంలో అక్కడి కలెక్టర్లు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
ఇవీ చదవండి: