కరోనా నుంచి లక్షల మంది కోలుకుంటున్నా.. ప్లాస్మా దానం చేసేందుకు మాత్రం అతి తక్కువ మంది ముందుకు వస్తున్నారని రక్తనిధి కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా వారియర్స్ ప్లాస్మాను దానం చేసి కొవిడ్ మరణాలను తగ్గించాలని కోరుతున్నారు.
కొవిడ్ మరణాలను తగ్గించటంలో ప్లాస్మా థెరపీ చాలా కీలకం. ప్రభుత్వం ప్లాస్మా దానం చేసిన కరోనా వారియర్స్ కు 5 వేల రూపాయలు నగదు ప్రోత్సాహం ప్రకటించింది. దీనికోసం ఎవరూ ముందుకు రావడం లేదని.. ఒక వేళ వచ్చిన వారిలో కొంతమంది 10 వేల నుంచి 50 వేల వరకు డిమాండ్ చేస్తున్నారని.. రక్తనిధి కేంద్ర నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో సుమారు 20 మంది కరోనా వారియర్స్ తాము ప్లాస్మా దానం చేస్తామని పేర్లు నమోదు చేసుకున్నారు. వారికి ఫోన్ చేసి ప్లాస్మా దానం చేసేందుకు రమ్మని కోరగా ..కొంతమంది ప్రభుత్వం 5 వేల రూపాయల నగదు ప్రోత్సాహం ఇస్తుందా? అని అడిగారని ..మరికొంతమంది 10 వేల నుంచి 50 వేల రూపాయల వరకు కావాలని అడిగినట్లు తెలుస్తోంది. చాలా మంది ఆరోగ్య కారణాలు చెప్పి ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావట్లేదు.
కొవిడ్ బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. కరోనా వారియర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని ప్రభుత్వం కోరుతుంది. ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మోడరేట్ కండీషన్ లో ఉన్న వారికి ప్లాస్మా థెరపీ చేస్తే త్వరగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. ప్లాస్మాదానం వ్యాపారంగా మారకూడదని పలువురు కోరుతున్నారు.
ఇదీ చదవండి: గ్లైడర్ కూలి ఇద్దరు నావికాదళ సిబ్బంది మృతి